ఒడిబియ్యం.. హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లైన భార్యాభర్తలకు ఒడిలో బియ్యం పోస్తూ ఉంటారు. ఈ ఒడిబియ్యం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని సంస్కృతిలో భాగమైపోయింది. ప్రధానంగా పెళ్లిళ్లు జరిగే చోట మాత్రం ఈ కట్టుబాట్లను బాగా ఆచరిస్తూ ఉంటారు. అయితే అసలు ఒడిబియ్యం అంటే ఏమిటి? పెళ్లైన వాళ్లకే ఎందుకు పోస్తారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషిలో వెన్నెముక్క లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈ నాడులను వెన్నెముక్కలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలా మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది.
ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో “ఒడ్డియాన పీఠం” ఉంటుంది. ఇక మరో విషయం ఏంటంటే..? మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే “ఒడ్డియాణం” వాడుకలో “వడ్యాణం” అంటారు. ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. అయితే ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి.
అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారని చాలా మంది నమ్మకం. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.