మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. మోక్షద ఏకాదశి రోజున విష్ణు మూర్తిని పూజిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. హిందువుల నమ్మకం ప్రకారం మానవ జన్మ అనేది అనంతం. పాపాలు చేసే కొద్దీ పుట్టడం, గిట్టడం, మళ్ళీ పుట్టడం అనేవి ఒక నిరంతర ప్రక్రియల సాగుతుంది. ఈ జన్మ పాపం నుంచి విముక్తి పొందాలంటే మోక్షం ఒకటే మార్గం. ఆ మోక్షాన్ని పొందే మార్గం ఈ మోక్షద ఏకాదశి చూపిస్తుందని హిందువుల నమ్మకం. మరి మోక్షద ఏకాదశి ఏరోజున వచ్చింది? ముహూర్త సమయం ఏంటి? పండుగ ప్రాముఖ్యత ఏంటి? పూజా విధానం? విష్ణువు అనుగ్రహం కోసం ఏం చేయాలి? ఎలాంటి మంచి పనులు చేస్తే మోక్షం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మోక్షద ఏకాదశి డిసెంబర్ 3న వచ్చిందని కొందరు, డిసెంబర్ 4న వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో గందరగోళం నెలకొంది. మోక్షద ఏకాదశి డిసెంబర్ 3వ తేదీన శనివారం ఉదయం 5.39 గంటలకు మొదలై.. మరుసటి రోజు అంటే డిసెంబర్ 4 ఆదివారం నాడు ఉదయం 5.34 గంటలకు ముగుస్తుంది. కాబట్టి శని, ఆదివారాలు ఈ మోక్షద ఏకాదశిని జరుపుకోవచ్చు. ఆదివారం ఉదయం 7.05 నుంచి 9.09 గంటల వరకూ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చునని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే కాలం చెందిన పూర్వీకులకు విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. సాధారణంగా శుక్ల పక్షంలో, కృష్ణ పక్షంలో కూడా ఏకాదశి వస్తుంది.
అయితే మార్గశిర మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి అత్యంత ప్రత్యేకమైన ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతం ఆచరించిన వారికి నరకం నుంచి విముక్తి లభిస్తుందని, జన్మ పాప బంధనం నుంచి విముక్తి కలిగి మోక్షం లభిస్తుందని శ్రీకృష్ణుడు.. అర్జునుడికి ఉపదేశించాడు. మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు.. అర్జునిడికి గీతోపదేశం చేయడం ప్రారంభించాడు. కురుక్షేత్ర సంగ్రామమున యుద్ధం చేయాలా? వద్దా? అని సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి.. శ్రీకృష్ణుడు సమర శంఖారావం పూరించి మరీ గీతోపదేశం చేశాడు. అందుకే ఈరోజున గీతా జయంతి అని కూడా పిలుస్తారు. ఇదే రోజున గీతా జయంతి జరుపుకుంటారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈరోజున ప్రత్యేక పూజలు, వ్రతం చేసిన వారి ఇంట ఆనందం, శ్రేయస్సు, సంపద కలుగుతాయని పండితులు చెబుతారు. ఈరోజున విష్ణువుని పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని అంటున్నారు.
మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీసుకుని, పళ్ళు తోముకుని.. తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. విష్ణు మూర్తి ఫోటో లేదా విగ్రహం ముందు ప్రమిద లేదా దీపం కుందెను ఏర్పాటు చేయాలి. దాంట్లో ఒత్తు ఉంచి, నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. అనంతరం ధూపం వేయాలి. చందనం, సింధూరం, తులసి ఆకులు, పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. పండ్లు, స్వీట్లు, ఇంట్లో చేసిన తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత మోక్షద ఏకాదశి కథ విని.. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఆఖరున హారతి ఇవ్వాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈరోజున దానధర్మాలు చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
విష్ణువు అనుగ్రహం ఉంటే పాప విముక్తి కలిగి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మరి ఏం చేస్తే మోక్షం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. మోక్షద ఏకాదశ రోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత తులసి కోట లేదా తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ.. ‘ఓం వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. అయితే తులసి మొక్కకు నీరు పోయకూడదని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే మోక్షద ఏకాదశి నాడు తులసి మొక్క జలరహిత ఉపవాసం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఇదే రోజున రావి చెట్టుకి నీరు సమర్పిస్తే.. విష్ణువు, లక్ష్మి దేవిల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. రావి చెట్టులో విష్ణు మూర్తి, లక్ష్మి దేవి నివాసం ఉంటారని హిందువుల నమ్మకం. కాబట్టి రావి చెట్టుకి నీరు సమర్పిస్తే లక్ష్మి దేవి కటాక్షం లభిస్తుందని అంటారు. తమలపాకు మీద కుంకుమతో శ్రీ అని రాసి.. ఆ ఆకుని మహా విష్ణువు పాదాల వద్ద ఉంచితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.