సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కొందరు యువకుల గడాలు మితిమీరిపోతున్నాయి. అసభ్యకర మెసేజ్లు పంపడం మొదలు ఆఫర్ల పేరుతో అమాయకులను మోసం చేయడం దాకా అంతా సోషల్ మీడియాలోనే జరుగుతోంది. ఓ యువకుడు అయితే ఏకంగా లేడీ కలెక్టర్ ఫొటో పెట్టేసి దందా షురూ చేశాడు. చివరికి అతడి గుట్టురట్టు కావడంతో కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు జైసల్మేర్ కలెక్టర్ టీనా దాబి ఫొటోతో దందా మొదలు పెట్టాడు. ఆమె ఫొటో ప్రొఫైల్ పిక్గా పెట్టి అందరికీ మెసేజ్లు పంపడం ప్రారంభించాడు. గుర్తుతెలియని వ్యక్తులకు వాట్సాప్లో అద్భుతమైన ఇంగ్లీష్లో ఈ-కామర్స్ గిఫ్ట్ కార్డులు కావాలంటూ మెసేజ్లు పంపేవాడు. ఆ మెసేజ్ చూసి నిజంగానే కలెక్టర్ అడిగారనుకుని అంతా రెస్పాండ్ అయ్యేవారు.
ఎప్పటిలాగానే ఓ రోజు రాజస్థాన్ అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ కార్యదర్శి సునితా చౌదరికి కూడా మెసేజ్ పంపాడు. అది చూసి ఆవిడ నిజంగానే కలెక్టర్ మెసేజ్ పంపినట్లుగా భావించారు. కానీ, కలెక్టర్ గిఫ్డ్ కార్డ్ అడగటం ఏంటని అనుమానం వచ్చి టీనా దాబీకి ఫోన్ చేశారు. తన పేరు మీద ఇలాంటి మెసేజ్ మోసం జరుగుతోందని తెలుసుకుని కలెక్టర్ విస్తుపోయారు. వెంటనే ఎస్పీకి సమాచారం ఇవ్వగా సైబర్ టీమ్తో దుంగార్పూర్ లో ఉన్న యువకుడిని అరెస్టు చేశారు.
సాధారణంగానే టీనా దాబీ దేశవ్యాప్తంగా పాపులర్ అనే చెప్పాలి. 2015 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టీనా దాబి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఐఏస్ అయ్యిన తొలి దళిత మహిళగా రికార్డులకెక్కారు. అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తిని మతాతంతర వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. తర్వాత విభేదాల కారణంగా విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. అలా మొదటి నుంచి టీనా దాబీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. కలెక్టర్ ఫొటోతో యువకుడు చేసిన మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.