ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. కనిపించిన దేవుడికి మొక్కితే పెళ్లైన 20 ఏళ్లకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కొడుకు ప్రయోజకుడు కావాలని ఉన్నత చదువులు చదివించారు. ఉన్ననాడు తిని లేని నాడు పస్తులున్నారు. అలా ఉన్నత చదువులు చదివించడంతో కొడుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాడు. కొడుకు ప్రయోజకుడు కావడంతో ఆ తల్లిదండ్రులు తమ కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నారు. దీంతో దగ్గరి బంధువైన ఓ అమ్మాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లై 9 రోజులు అవుతుంది. ఆఫీసుకు పెట్టిన సెలవులు సైతం ముగియడంతో ఆ యువకుడు తన భార్యను వెంట పెట్టుకుని నగరానికి పయనమయ్యాడు. అలా వెళ్తున్న క్రమంలోనే ఊహించని ప్రమాదానికి గురై కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం. ఇదే ప్రాంతానికి చెందిన ములకలపల్లి రాములు, మైసమ్మ దంపతులు. వీరికి పెళ్లైన 20 ఏళ్లకు ఎందరో దేవుళ్లకు మొక్కితే వీరభద్రం(25) అనే కుమారుడు జన్మించాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించారు. ఇక బాగా చదివి వీరభద్రం సాఫ్ట్ వేర్ రంగంలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. హైదరాబాద్ లోనే ఉంటూ ఉద్యోగానికి వెళ్తుండేవాడు. అయితే కొడుకు ప్రయోజకుడు కావడంతో తల్లిదండ్రులు పెన్ పహడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పేర్ల ప్రణీత అనే యువతితో ఈ నెల 21న ఘనంగా వివాహం జరిపించారు.
ఆఫీసుకు పెట్టిన సెలవులు ముగియడంతో వీరభద్రం తన భార్యను తీసుకుని హైదరాబాద్ నగరానికి బయలుదేరాడు. సోమవారం మధ్యాహ్నం ఆత్మకూరు నుంచి బైక్ పై బయలుదేరి చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజాకు రాగానే వీరభద్రం బైక్ టోల్ గేట్ బోర్డును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణీత, వీరభద్రం ఎగిరికింద పడ్డారు. వెంటనే గమనించి స్థానికులు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక ఫలితం లేకపోవడంతో వీరభద్రం అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
ప్రణీతకు సైతం తీవ్ర గాయలవ్వడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వీరభద్రం తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో రాములు,మైసమ్మ కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అనంతరం పోలీసులు వీరభద్రం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెళ్లై 10 రోజులు కాలేదు.. అంతలోనే వీరభద్రం మరణించడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.