ఆఫీసులో, ఇంట్లో, పాఠశాలల్లో, మందిరాల్లో, వివిధ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగుచూస్తున్నాయి. మాటలు, ప్రవర్తన, చేష్టలు, సైగల ద్వారా సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలకు చట్టం కఠినమైన శిక్షలు విధిస్తోంది. దురుద్దేశంతో తాకడం, శారీరక వేధింపులు, లైంగిక కోరికలను వ్యక్తపరచడం, లైంగికపరమైన మాటలు, వ్యక్తుల లైంగిక ధోరణి, లైంగిక జీవితం గురించి వ్యాఖ్యలు చేయడం, పోర్న్ వీడియోలు చూపించడం , వీటి ద్వారా మహిళలకు ఇబ్బందికరమైన పని వాతావరణాన్ని సృష్టించడం.. వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. చట్టాలు ఎన్ని వచ్చినా ఇప్పటికి చాలా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. శిక్షణ ఇవ్వాల్సిన ఓ కోచ్ కామంతో కళ్లు మూసుకుపోయి, మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది.
ఈ ఏడాది మే నెలలో అథ్లెటిక్స్ కోచ్గా ఉన్న పి. నాగరాజన్పై ఓ 19 ఏళ్ల జాతీయ స్థాయి మహిళా అథ్లెట్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడం కలకలం సృష్టిస్తోంది. మహిళా అథ్లెట్లు నాగరాజన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో రాసుకొచ్చింది. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో కొందరు రిటైర్ అయినవారు ఉండగా మరికొందరు నాగరాజన్ వద్ద జూనియర్లుగా శిక్షణ పొందినవారు ఉండటం విశేషం. ఇక లైంగిక వేధింపులు గత కొన్నేళ్లుగా సాగుతున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో పేర్కొంది.
మసాజ్ పేరుతో కోచ్ తనను తాకరాని చోట తాకి పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడని అథ్లెట్ ఆవేదన వ్యక్తం చేసింది. భయం కారణంగా కోచ్కు ఎదురు చెప్పలేకపోయానని, చాలా సందర్భాల్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని పేర్కొంది. ఈ కేసులో నాగరాజన్ను విచారించిన పోలీసులు అతనిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఛార్జిషీట్ ఓపెన్ చేశారు.