పరువు కోసం పాకులాడే మనుషులు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ సంస్కృతి మరీ ఎక్కువైపోయింది. కూతురు కులం తక్కువ వాడని పెళ్లి చేసుకుందని, అంటరాని వారితో ప్రేమలో పడిందనే కారణంతో తల్లిదండ్రులు పరువు కోసం ఏకంగా కన్న కూతురుని సైతం చంపేందుకు వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళపై బంధువులే దాడి చేసి నడి రోడ్డుపై గుండుకొట్టారు. తాజాగా ఈ ఘటనకు సంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతుంది. అసలు బంధువులే ఆ మహిళకు గుండు కొట్టించడం ఏంటి? అసలు ఆమె చేసిన నేరం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది గుజరాత్ లోని అమ్రేలి జిల్లా బాబ్రా పరిధిలోని ఓ గ్రామం. ఇక్కడే ఓ మహిళ నివాసం ఉంటుంది. అయితే ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఆ మహిళకు గతంలో వివాహం జరిగింది. ఇక పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. కానీ ఉన్నట్టుండి ఆమె భర్త మరణించాడు. దీంతో కొన్నాళ్లు ఆ మహిళ ఒంటరి జీవితాన్ని గడిపింది. దీంతో అలా ఉండలేని ఆ మహిళ తోడు కోసం స్థానికంగా ఉండే మరో యువకుడిని వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు మహిళపై ఒంటి కాలుపై లేచారు. ఉన్న పరువును గాలి కొదిలేసి ఇంతకు తెగించావా.. అంటూ ఆ మహిళపై గ్రామస్తులు, బంధులు దాడికి పాల్పడ్డారు.
ఇక ఇంతటితో ఆగకుండా ఆ దుర్మార్గులు.. నడి రోడ్డుపై ఆ మహిళను ఓ స్థంభానికి కట్టేసి ఆమెకు గుండు కొట్టారు. ఈ అమానుష ఘటనను గ్రామస్తులు అంతా సినిమా చూసినట్లుగా చూసి తమ తమ సెల్ ఫోన్ లలో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చివరికి పోలీసుల వరకు వెళ్లింది. ఈ దారుణ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మహిళను రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మహిళ రెండవ పెళ్లి చేసుకుందని గ్రామస్తులు, బంధువుల గుండు కొట్టి తీరు ఎంత వరకు సమంజసం? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) December 15, 2022