డబ్బుల కోసం కొందరు ఎంత నీచానికైనా తెగిస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. బిల్లుల కోసం చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే!
ఆరోగ్యం విషయంలో సామాన్యులకు ఎప్పుడూ భయమే. ప్రభుత్వ ఆస్పత్రులకు పోతే అక్కడ సరిగ్గా వైద్యం అందుతుందో లేదోననే అనుమానం. సర్కారీ దవాఖానాల్లో మౌలిక వసతులు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రైవేటు ఆస్పత్రికి పోతే లక్షలకు లక్షలు బిల్లులు కట్టాల్సి వస్తుందనే గుబులు. ఇక, ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోందని పేషెంట్లు వాపోతున్నారు. అనారోగ్యం అని వస్తే అందినకాడికి దోచేస్తున్నారని అంటున్నారు. ఠాగూర్ సినిమాలో మాదిరిగా చనిపోయిన వ్యక్తిని బతికున్నట్లు నమ్మించి.. రూ.లక్షల బిల్లులు వేసి మోసం చేసిన ఘటనల గురించి వింటున్నాం. తాజాగా అలాంటి ఘటనే వరంగల్లో వెలుగు చూసింది.
ఖిలా వరంగల్ మండలంలోని గాడిపెళ్లి గ్రామానికి చెందిన అఖిల ఇంటర్ వరకు చదవి ఇంట్లోనే ఉంటోంది. ఫిబ్రవరి 23న ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. నొప్పి భరించలేక పురుగుల మందు తాగింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హనుమకొండలోని సిగ్మా ఆస్పత్రికి తరలించారు. అఖిలను పరిశీలించిన వైద్యులు.. ఆమెను ఐసీయూలో చేర్చారు. వారం రోజుల పాటు ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెబుతూ వచ్చిన డాక్టర్లు.. పేషెంట్ను చూసేందుకు ఒప్పుకోలేదు. మొత్తంగా రూ.16 లక్షల బిల్లు వసూలు చేశారు. ఈ గురువారం అఖిల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు.
గురువారం సాయంత్రం వరకు పేషెంట్ను చూడనివ్వకుండా బాగానే ఉందని నమ్మబలుకుతూ వచ్చిన వైద్యులు.. గట్టిగా నిలదీయడంతో అఖిల చనిపోయిన విషయాన్ని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు.. ఆస్పత్రి బయటకు ఆందోళనకు దిగారు. డబ్బుల కోసం ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు నటించారని, హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకుని, ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. మరి.. బిల్లుల కోసం శవాలకు ట్రీట్మెంట్ చేస్తున్నట్లు డాక్టర్లు నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.