మేము ఇన్ని రోజులు బతికి ఉన్నామంటే కారణం మా అమ్మ కోసమే. ఇప్పటికీ కూడా మేము బతకాలనే అనుకుంటున్నాము, అది మా అమ్మ ఉంటేనే. మా అమ్మ ఉందనే చిన్న ఆశతోనే మేము బతికి ఉన్నాం. నా భార్య కనిపించకపోవడానికి అనేక మంది పెద్దల హస్తం ఉంది. దీని వెనక ఎందరో వ్యక్తుల కుట్రదాగి ఉందని అనిపిస్తుంది. దీనిపై నేను పూర్తిగా ఎంక్వైరీ చేశాను. పెన్ డ్రైవ్, సెల్ ఫోన్లలో ఆ సమాచారమంతా దాగి ఉంది. ఆ సమాచారాన్ని పోలీసులకు అందిస్తా. వెంటనే ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును టేకప్ చేసి 48 గంటల్లోగా త్వరితగతిన నా భార్య ఆచూకీ కనిపెట్టాలి. లేదంటే మా ముగ్గురు శవాలు చూస్తారని ఓ భర్త, పిల్లలతో పాటు తీసుకున్న ఈ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన దొరాశెట్టి సత్యమూర్తి-అన్నపూర్ణ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త సత్యమూర్తి వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఇద్దరు పిల్లలతో వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంది. కట్ చేస్తే గత ఐదు నెలల క్రితం సత్యమూర్తి భార్య అన్నపూర్ణ కనిపించకుండా పోయింది. దీంతో భర్త బంధువుల ఇంట్లో, చుట్టపక్కల అంతా వెతికాడు. ఎంతకు కూడా తన భార్య ఆచూకీ దొరకలేదు. ఇక చేసేదేం లేక భర్త రెండు రోజుల తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Khammam: చూస్తుంటే అమాయకురాలిలా ఉన్నావ్..! మరీ ఇంత దిగజారావా తల్లి?
పోలీసుల గాలింపుల్లో కూడా అన్నపూర్ణ ఆచూకీ దొరకలేదు. ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు నెలల కావొస్తున్న అన్నపూర్ణ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో తల్లి కనిపించకపోవడంతో పిల్లలు, భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక చేసేదేం లేక భర్త.. పిల్లలతో పాటు సెల్ఫీ వీడియో తీసి పోలీసులకు,ప్రభుత్వానికి ఓ డెడ్ లైన్ విధించాడు. 48 గంటల్లోగా నా భార్య ఆచూకీ తెలపకపోతే మా శవాలు చూస్తారంటూ తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోతో అప్రమత్తమైన పోలీసులు 48 గంటల్లోగా అన్నపూర్ణ ఆచూకీ కనిపెడతారో లేదో చూడాలి మరి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.