రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే హరిహర కృష్ణ నుంచి పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు.
నవీన్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో హరిహరకృష్ణను పోలీసుల విచారణలో ఇప్పటికే పలు విషయాలను వెల్లడించాడు. మొదట ఈ హత్యకేసుకు ఎవరికీ సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చిన హరిహర కృష్ణ.. ఇప్పుడు ప్రియురాలి కోసమే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో హరిహర కృష్ణ ప్రియురాలు, హసన్ తమకు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచీ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే వారికి ఈ హత్యతో సంబంధం ఉంటుందనే అనుమానంతో పోలీసులు యువతిని, హసన్ ను విచారించారు.
మొదట ముగ్గురినీ పోలీసులు విడివిడిగా విచారించారు. అప్పుడు వాళ్లు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు ముగ్గురునీ ఒకే దగ్గర ఉంచి మళ్లీ ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన వాట్సాప్ హిస్టరీని పోలీసులు రికరవీ చేశారు. వాటిని చూపిస్తూ ఈ ముగ్గురిని ప్రశ్నించగా అసలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. హరిహర కృష్ణ మొదట నవీన్ ని హత్య చేసిన తర్వాత హసన్- యువతిని తీసుకెళ్లి మృతదేహాన్ని వారికి చూపించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రియురాలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి హసన్ తో కలిసి హరిహర కృష్ణ అతని ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు.
అంతేకాకుండా హసన్ వాళ్ల ఇంట్లో హరిహర కృష్ణ దుస్తులు మార్చుకుని వాటిని ఎవరికీ కనిపించకుండా పారేశారు. అయితే ఈ మొత్తం విషయాలు తెలిసి కూడా ఇప్పటివరకు యువతి- హసన్ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకపోవడంతో కేసుతో వీరికి సంబంధం ఉందనే నిర్ణయానికి పోలీసులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో ఏ1 హరిహర కృష్ణ కాగా.. ఏ2గా హసన్, ఏ3గా ప్రియురాలు పేర్లు చేర్చి ఆ ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ఈ అరెస్టుతో నవీన్ హత్య కేసు మొత్తం మరో టర్న్ తీసుకున్నట్లు అయ్యింది. నవీన్ హత్య కేసులో హసన్- యువతిని అరెస్టు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.