భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజం. కానీ ఈ మద్య కొంతమంది గొడవలు జరిగిన తర్వాత క్షణికావేశానికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పపడి నిండు జీవితాలను బలిచేసుకుంటున్నారు.
ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు, పని ఒత్తిడి ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ లోకి వెళ్లి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన భర్త చనిపోతాడని భావించిన భార్య క్షణికావేశంలో దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
రామాయంపేట మండలం అక్కన్న పేటలో విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ గొడవ కారణంగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం నాలుగు నిండు ప్రాణాలు బలితీసుకుంది. అక్కన్నపేటకు చెందిన ఎల్లం కి, మెదక్ మండలం వెంకటాపూర్ కి చెందిన లక్షీ కి ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్లలోపు శరణ్య, శ్రావ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎల్లం తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు.. అతని తోడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. రెండోవాడు అశోక్ కి పెళ్లి జరిగింది. మూడో తమ్ముడు రాజు కి వివాహం కాలేదు.
ఎల్లం కి గ్రామంలో వ్యవసాయభూమి లేకపోవడంతో హైదరాబాద్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. అతనితో పాటు తమ్ముడు రాజు కూడా ఉంటున్నాడు. వీరందరిదీ ఉమ్మడి కుటుంబం. ఎల్లం గ్రామంలో అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవాడు. గత కొంతకాలంగా ఎల్లం అతని భార్య లక్ష్మికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన ఎల్లం విషం తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స కోసం మెదక్ ఆస్పత్రికి తరలించారు. తన భర్త బతికే అవకాశం లేదని తెలుసుకున్న లక్ష్మి తన ఇద్దరు పిల్లలను వెంటతీసుకొని ఆస్పత్రి నుంచి పుట్టింటికి బయలుదేరింది. కొండూర్ వద్ద ఆగి అక్కడ ఉన్న చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తనూ నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పపడింది. కోమాలో ఉన్న భర్త ఎల్లం కూడా కన్నుమూశాడు. ఒకేసారి నలుగురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.