భర్త అంటే భరించేవాడు అంటారు. కానీ.., ఆ భర్త మద్యానికి బానిసై, మోసాలకి పాల్పడుతూ.. భార్యకి భారం అయ్యాడు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించినందుకు ఆమెని హతమార్చాడు. చేసిన దారుణాన్ని కప్పి పుచ్చుకోవడానికి కరోనా వైరస్ పేరు చెప్పి.., అడ్డంగా పోలీసులకి దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., కడప జిల్లా బద్వేల్ కి చెందిన మారేంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి చిన్న తనంలోనే రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఇందుకోసం సోషల్ సర్వీస్ అంటూ హడావిడి చేస్తూ.., పెద్ద పెద్ద నాయకులను కలుస్తూ ఉండేవాడు. ఇతని మాటలు కూడా అంతే మంచివిగా ఉండేవి. ఇక సమాజాన్ని ఉద్దరించడమే తన ద్యేయంగా చెప్పుకునే మారేంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏరికోరి ఓ అనాధని వివాహం చేసుకున్నాడు.
ఆమె పేరు భువనేశ్వరి. చిన్ననాటి నుండి ఎలాంటి తోడు లేకపోయినా.., కష్టపడి చదివి సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ గా లైఫ్ లో సెటిల్ అయ్యింది. ఆదర్శ భావాలున్న ఓ మంచి వ్యక్తి తనకి భర్తగా దొరికినందుకు, తనకి కూడా ఓ కుటుంబం ఏర్పడినందుకు ఆ పిచ్చి తల్లి ఎంతగానో మురిసిపోయింది. కానీ.., పెళ్లి అయిన కొన్నాళ్లకే భర్త అసలు స్వరూపం బయట పడింది. ఎలాంటి పని చేయకుండా రాజకీయాలు అని తిరిగే శ్రీకాంత్ రెడ్డి చిన్న చిన్న మోసాలకు పాల్పడటం, జైలు పాలుకావడం అలవాటుగా మార్చుకున్నాడు. తరువాత కాలంలో డబ్బు కోసం భార్యని వేధించడం మొదలు పెట్టాడు. భర్తలో మార్పు వస్తుందని భువనేశ్వరి చాలా కాలం ఎదురు చూసింది. కానీ.., లాభం లేకపోయింది. మధ్యలో లాక్ డౌన్ రావడంతో కాపురాన్ని హైదరాబాద్ నుండి తిరుపతికి షిఫ్ట్ చేశాడు. ఇక భువనేశ్వరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటి నుండి ఆమెకి వేధింపులు ఇంకాస్త ఎక్కువ అయ్యాయి. ఆ బాధలని తట్టుకోలేక ఆమె ఓ రోజు భర్తకి ఎదురు తిరిగింది. దీంతో.. కోపంతో ఊగిపోయిన శ్రీకాంత్ రెడ్డి మద్యం మత్తులో భార్యను హత్య చేశాడు.
భార్య శవాన్ని రుయా ఆస్పత్రిలోని మెడిసన్ గోడౌన్ వెనుకవైపుకు తీసుకెళ్లాడు. అక్కడే మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక్కడ నుండి శ్రీకాంత్ రెడ్డి కొత్త నాటకానికి తెర తీశాడు. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ సోకి చనిపోయిందని.., మృతదేహాన్ని రుయా సిబ్బందే ఖననం చేశారని బంధువులను నమ్మించాడు. అంతేకాదు హత్యచేసిన తర్వాతి రోజు రుయా ఆస్పత్రిలో చాలా సేపు హడావిడి చేశాడు. దీంతో.., బంధువులు కూడా భువనేశ్వరి కరోనా సోకి చనిపోయినట్లు నమ్మేశారు. కానీ.., రుయా ఆస్పత్రి వెనక భాగంలో సూట్ కేస్ లో ఉన్న సగం కాలిన శవాన్ని పోలీసులు గుర్తించారు. వారి దర్యాప్తులో శ్రీకాంత్ రెడ్డి చేసిన దారుణాలన్నీ బయటపడ్డాయి. జీవితంలో అనాధగా పెరిగిన ఆ పిచ్చి తల్లిని పెళ్లి చేసుకుని.., శ్రీకాంత్ రెడ్డి ఇంత దారుణానానికి ఒడికట్టడంతో ప్రజలంతా అతన్ని తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నారు.