గత కొంతకాలంగా దేశంలో ఉగ్రవాదులు పలు నగరాల్లో విధ్వంసాలకు తెగబడుతున్నారు. జనసంచారం ఉన్నచోట బాంబులు పేలుస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు.
దేశంలో కొంతకాలంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా చేసుకొని పలుమార్లు దాడులకు తెగబడుతున్నారు. దేశంలోని మహానగరాల్లో అలజడులు సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రని పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే..
ఉగ్రవాదులు బెంగుళూరు కేంద్రంగా చేసుకొని పలు చోట్ల దాడులకు ప్లాన్ చేసినట్టుగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పక్కా సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బుధవారం అయిదుగురు అనుమానిత టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని జునైద్, సోహైల్, ముదాసిర్, ఉమర్, జాహిద్గా గుర్తించారు. వీరి నుంచి సెల్ ఫోన్లతో పాటు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో మరో ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు.
ఇక అరెస్ట్ అయిన నిందితులు 2017 లో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ కేసు విషయంలో బెంగుళూరు సెంట్రల్ జైలులో శిక్ష కూడా అనుభవించారని తెలిపారు. ఆ సమయంలో కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని.. పేలుడు పదార్థాలను ఎలా వాడాలో శిక్షణ కూడా తీసుకున్నారని సీసీబీ పోలీసులు తెలిపారు. మొత్తానికి నగరంలో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భగ్నం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.