ప్రేమ పేరుతో ఘోరాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రేమించానని వెంటపడటం, ప్రేమించమని కాళ్లు పట్టుకోవడం, ఒప్పుకోకపోతే బెదిరింపులకు దిగి వేధించడం. ఇలాంటి ఘటనలు ఇంకా అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో వేధిస్తూ వారి ప్రాణాలు తీయడం లేదా ప్రాణాలు తీసుకునే ప్రేరేపించడం చేస్తున్నారు. అలాంటి ఓ ఉన్మాది చేష్టలకు ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఒకసారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ విద్యార్థిని రెండోసారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉప్పునూతల కావ్య(16) చౌటుప్పల్ లోని ఓ ప్రేవేటు స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. కావ్య వాళ్ల ఊరకి చెందిన శివమణి తనను ప్రేమించాలంటూ వేధింపులకు దిగాడు. ఇన్ స్టాగ్రామ్ లో కావ్యకు తరచూ మేసేజెస్ పెడుతూ ఉండేవాడు. తనని ప్రేమించకపోతే వాళ్ల అమ్మానాన్నలను చంపేస్తానంటూ బెదిరించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆమె తన సోదరుడు నరేశ్ కు విషయం చెప్పింది.
తన చెల్లిని వేధిస్తున్నాడని తెలియగానే నరేశ్ వెళ్లి శివమణికి వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 31న వారిద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. శివమణి కావ్యకు ఫోన్ చేసి వాళ్ల అన్నను చంపేస్తానంటూ బెదిరించాడు. మనస్తాపంతో కావ్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. తర్వాత ఈ విషయం పంచాయికి వచ్చింది. ఇరు కుటుంబాలు శివమణి విషయంలో ఒక్ నిర్ణయం తీసుకున్నారు. అతను ఇకపై కావ్య జోలికి రాకూడదని హెచ్చరించారు.
అయినా తీరు మార్చుకోని శివమణి కావ్యను వేధిస్తూనే ఉన్నాడు. బుధవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. కావ్య ఇంట్లో ఒక్కతే ఉంది. శివమణి వేధింపులు ఆపడని నిర్ణయించుకుందో.. తన వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని భావించిందో.. కావ్య ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన నరేశ్ కు తన సోదరి ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. కావ్య తండ్రి కనకయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇరు కుటుంబాలు, బంధువులు, స్థానికుల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.