Audio Leak: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ముట్టడించారు. రైళ్లు, స్టాళ్లను తగలబెట్టి నానా భీభత్సం చేశారు. అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై దాడి ప్రీ ప్లాన్గా జరిగినట్లుగా తెలుస్తోంది. ఆర్మీ ఉద్యోగ ఆశావాహుల వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో సికింద్రాబాద్లో నిరసనపై సమాచారం షేర్ చేసుకున్నట్లు సమాచారం.
పక్కా ప్లాన్తో సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారని తెలుస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించినది అంటూ ఓ ఆడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. శుక్రవారం సికింద్రాబాద్లో ఆందోళన సందర్భంగా ఓ యువకుడు మాట్లాడిన వాట్సాప్ ఆడియో మెసేజ్గా దాన్ని భావిస్తున్నారు. ఆ ఆడియోలో ‘‘ ఎంత సేపు వర్రుతారురా.. వర్రుర్రి నోర్లు నొస్తయ్! గమ్మున పోయి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టేసినమనుకో.. బయటకు పోతది న్యూస్. అంతేకానీ, ఎంత సేపు వర్రినా.. ఎంత సేపు బ్యానర్లు చూపించినా.. ఎంత మొత్తుకున్నా ఏమవ్వదు. ఇంకో రెండు గంటల్లో.. గంటలో స్క్వాడ్ వస్తది. అందర్నీ… అందుకే పోయి.. పెట్రోల్ బంకుపోయి.
మొత్తం తగుల బెట్టొచ్చు రెండు నిమిషాలల్లో…. అరే! పెట్రోల్ పంపు పోతున్నా పెట్రోల్ తీసుకురావటానికి ఎవరైనా వస్తే.. పెట్రోల్ తీసుకురావటానికి రండి… సబ్లోగ్ బెటాలియన్ ఆగయా.. రౌతిబౌలికనేకో ఆజావ్ బస్ జలాయేంగే..’’ అని ఓ యువకుడు మాట్లాడటం అందులో వినొచ్చు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఈ ఆడియో సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించినదా.. కాదా.. అన్న విషయం తెలియరాలేదు. మరి, ఈ ఆడియోపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Agneepath: వరంగల్ రాజేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత..