కరోనా నేపథ్యంలో చాలామంది ఇళ్లలోనే గడుతున్నారు. దీంతో కాలక్షేపం కోసమని ఆన్లైన్ రమ్మీని ప్రారంభించి, చివరకు బానిసలుగా మారి పోతున్నారు. చాలామంది లక్షలాది రూపాయలను పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు. టెక్నాలజీపై పట్టున్న కొంతమంది ఫేక్ జీపీఎస్ ద్వారా ఆన్లైన్ రమ్మీ యాప్లోకి యాక్సిస్ అవుతూ తమ ఆచూకీ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇటీవల కాలంలో మళ్లీ ఆన్లైన్ రమ్మీ పెరుగుతూ వస్తోంది. నగరంలో పురుషులతో సమానంగా మహిళలు ఆన్లైన్ రమ్మీ ఆడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉన్నతస్థాయి కుటుంబాలకు చెందినవారితోపాటు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఒక టీమ్గా ఏర్పడి ఆన్లైన్లో పేకాట ఆడుతున్నారు. భారీమొత్తంలోనే బెట్టింగ్ పెట్టుకుంటున్నారు.
ఆన్లైన్లో పేకాట కోసం పురుషులతో పాటు మహిళలు రమ్మీకి సంబంధించిన యాప్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇందుకోసం పేరు, ఈమెయిల్ ఐడీ, ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ ఖాతా వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం రమ్మీ ఖాతా ఒకటి కేటాయింపు జరుగుతుంది. ఆ ఖాతాకు తమ బ్యాక్ ఖాతా నుంచి ఎప్పటికప్పుడు డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుండాలి. ఆన్లైన్లో లాగిన్ కాగానే అక్కడ కొంతమంది వెయింటింగ్లో ఉంటారు. వారిలో తమకు కావాల్సిన వారిని టేబుల్పైకి ఇన్వైట్ చేసి, ఆడడం మొదలుపెడుతున్నారు.
ఆన్లైన్ రమ్మీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఎవరైనా రమ్మీ ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఆడుతుండడం వల్ల సమాచారం రాబట్టడం కొంత కష్టం కాబట్టి, ప్రజలే ఇటువంటి వాటిని పోలీసుల దృష్టికి తీసుకురావాలి. తద్వారా నగరంలో ప్రశాంతత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.