టీఎస్ ఆర్టీసీ సంస్థ ద్వారా ప్రజలకు నిరంతరం సేవలు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణించుటకు, అవసరమైన వస్తువులను తరలించేందుకు బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్టీసీ సంస్థ తాజాగా గ్రామీణ ప్రాంతాల వారికి టి-9 టికెట్ ద్వారా మరింత చేరువకాబోతుంది.
నిరంతరం ప్రజలకు సేవలందించే ఆర్టీసీ సంస్థ అధికారులు ప్రజలకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేస్తున్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బస్సు గ్రామీణ ప్రాంతాలలో అతి ముఖ్యమైన రవాణా సాధనం. చిన్నచిన్న పల్లెలకు సైతం ఆర్టీసీ బస్సులు వెళ్లి గ్రామీణ వాసులకు సేవలందిస్తున్నాయి. చిన్న వ్యాపారస్తులు కూడా పట్నం వెళ్లి సరుకులు కావలసిన సరుకులను తెచ్చుకుంటారు. ఆర్టీసీ బస్సుల్లో లేడీస్, సీనియర్ సిటీజన్స్, దివ్యాంగుల కొరకు సీట్లు కేటాయించి వారిని గౌరవిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు ఎన్ని ఉన్నా ఆర్టీసీ సంస్థ అందించే సేవలు మరువలేనివి.
టీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఆఫర్లు అందిస్తుంది. బస్సు ప్రయాణానికి ఆకర్షితులవడానికి ఇటువంటి ఆఫర్లు పెడుతూనే ఉన్నారు. సిటీ బస్సులలో రూ. 50 టికెట్తో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అంటే ఆరు గంటల వరకు ఎక్కడైనా ప్రయాణించొచ్చు. డే పాస్.. దీనికి రూ. 100 చెల్లిస్తే చాలు సిటీ అంతటా ఒక రోజు అంటే 24 గంటల వరకు సిటీ మొత్తం ప్రయాణం చేయవచ్చు. తాజాగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో టీఎస్ ఆర్టీసీ మరో ఆఫర్ అందిస్తోంది. పల్లె వెలుగు బస్సుల్లో ‘టి-9 టికెట్’ ద్వారా రూ.100 చెల్లించి.. 60 కిలో మీటర్ల పరిధిలో ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆర్టీసీ ఇప్పటికే టి-24, టి-6, ఎఫ్-24 అనే టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల వారికి ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టి-9 టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల మేర రానుపోను రూ.100 చెల్లించాలి. అంటే ప్రతి వ్యక్తికి రూ.20 నుండి రూ.40 ఆదా చేయవచ్చు. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం హైదరాబాద్లోని బస్ భవన్లో ‘టి-9 టికెట్’పోస్టర్ను లాంచ్ చేశారు. టి-9 టికెట్లు ఆదివారం నుండి పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. కండక్టర్ దగ్గర ఈ టికెట్లను పొందవచ్చు. సీనియర్ సిటీజన్స్, మహిళలకు మాత్రమే ఈ టికెట్ వర్తిస్తుంది. దీంతో ప్రయాణికులు రూ.20-40 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు వారి వివరాలకోసం ఆధార్ కార్డును కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రూ. 100 చెల్లించి, 60 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణం చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయాణికులు ఆర్టీసీ సంస్థను ఆదరించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరుతున్నారు.