ఓ యువకుడు ఏయ్ బామ్మర్ధి.. తిన్నావా..! అంటూ ఓ యువకుడిని పలకరించాడు. అలా అనడంతో తట్టుకోలేకపోయిన మరోక యువకుడు కోపంతో ఊగిపోయి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. అది నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామం. ఇక్కడే శ్రీకాంత్, శ్రీనివాస్ అనే యువకులు నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి వీరిద్దరూ ఊళ్లోని ఓ అరుగుపైన కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఏయ్ బామ్మర్ధి.. తిన్నావా.. అంటూ శ్రీనివాస్, శ్రీకాంత్ అనే యువకులు పలకరించుకున్నారు. ఈ సమయంలోనే అటు నుంచి సాయి ప్రసాద్ (23) అనే యువకుడు వచ్చాడు. వాడు నన్నే బామ్మర్ధి అన్నాడనుకుని వారిద్దరితో సాయి ప్రసాద్ గొడవకు దిగాడు. ఇదే గొడవ చిలికి చిలికి చివరికి గాలి వానలా మారిపోయింది. ఇక కోపంతో ఊగిపోయిన సాయి ప్రసాద్ శ్రీనివాస్ పై దాడి చేయడంతో అక్కడికక్కడే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
వెంటనే సాయి ప్రసాద్ ను పట్టుకున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు నిందితుడు సాయి ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ మరణంతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.