వయసులో ఉన్న యువతీ- యువకులు ఒకరికి ఒకరు ఆకర్షితులు కావడం, ప్రేమలో పడటం అనేది సర్వసాధారణం. కొందరు తమకు నచ్చిన అమ్మాయిని/అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఎలాగైనా వారి దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తుంటారు. వారి దృష్టిలో వీళ్లే నంబర్ 1గా ఉండాలి అనుకుంటారు. అలా నిరూపించుకునేందుకు చాలా తిప్పలే పడుతుంటారు. కొందరు మంచి మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. అదే దారిలో వెళ్తూ చివరకి సర్వం కోల్పోతారు. అలాంటి ఘనటే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు ఏకంగా దొంగగా మారిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర థానే జిల్లా మహారాష్ట్ర థానె జిల్లా కల్యాణ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. శుభం భాస్కర్ పవార్ అనే యువకుడు కల్యాణ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఓ బైక్ దొంగతనం కేసులో అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరిపారు. వారి విచారణలో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. అతను అప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు మొత్తం 13 బైకులు దొంగతనం చేశాడు. అది కూడా సాదా సీదా బైకులు కాదు. వాటి ధరే లక్షల్లో ఉంటుంది. అంత ఖరీదైన బైకులను ఎందుకు దొంగతనం చేశాడో తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు.
ఆ ఖరీదైన బైకుల మొత్తం విలువ కనీసం రూ.16 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఆ విచారణలో వారికి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఆ శుభం భాస్కర్ పవార్ అనే యువకుడు ఈ దొంగతనాలు చేస్తోంది తన ప్రియురాలి కోసమట. అవును అతను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ చోరీలు చేస్తున్నాడట. ఆమెతో సంతోషంగా గడిపేందుకు, ఆమెకు నచ్చిన వస్తువులు కొనిపెట్టేందుకు, ఆమెతో విలాసంగా గడిపేందుకు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడట. ప్రియురాలి కోసం దొంగగా మారాడని తెలుసుకుని మొదట పోలీసులు కంగు తిన్నారు. ప్రస్తుతం ఈ దొంగ గురించి వార్తలు స్థానికంగా వైరల్ అవుతున్నాయి. ప్రియురాలి కోసం దొంగగా ఎలా మారావు బ్రో అంటూ నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి.