మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి క్షణికావేశంలో భార్యా, పిల్లలను హత్య చేసి ఆ తర్వాత తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ మధ్యకాలంలో కొందరు భార్యాభర్తలు ప్రతీ చిన్న విషయానికి కూడా గొడవ పడుతున్నారు. అంతే కాకుండా తిట్టుకుంటూ, కొట్టుకుంటూ చివరికి విడాకులు వరకు వెళ్తున్నారు. అయినా కోపం తగ్గకపోవడంతో చివరికి హత్యలు చేయడమో, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వ్యక్తి భార్యా, పిల్లలను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఫోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర పూణే జిల్లా డాండ్ మండలం వార్వాండ్ గ్రామం. ఇక్కడే అతుల్ దివేకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా పశు వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతుల్ దివేకర్ గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగింది. కొన్నాళ్లకి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇకపోతే, ఈ మధ్యకాలంలో ఈ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి.
దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకునేవారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త అతుల్ దివేకర్.. భార్యను ఉరి తీసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పిల్లలను కూడా హత్య చేసి దగ్గరలోని ఓ చెరువులో పడేశాడు. అనంతరం అతుల్ దివేకర్.. భార్య వేధింపుల కారణంగానే ఇలా చేశానంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.