విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే.. గాడి తప్పింది. విద్యార్థినులకు తెలియకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసి వేరే వ్యక్తులకు పంపుతుంది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతలమానేపల్లి మండలం బాబాపూర్-గంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పి. సువిత టీచర్ గా పనిచేస్తుంది. ఈమె క్లాస్ రూములో విద్యార్థినుల వీడియోలు, ఫోటోలు తీసి ఇతర వ్యక్తులకు పంపిస్తుంది. అంతేకాకుండా బాలికలతో మద్యం గురించి చర్చించడం, అమ్మాయిలను పొట్టి బట్టలు వేసుకోవాలని సూచించడం, ఇతర వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడాలని బలవంతం చేస్తోంది. ఈ విషయం బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
ఆ టీచర్ ని సస్పెండ్ చేయాలని.. విద్యార్థినులతో కలిసి వారి తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా చేశారు. దీంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ మహిళా టీచర్ ని సస్పెండ్ చేసింది. టీచర్ ని సస్పెండ్ చేసినందుకు విద్యార్థినుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు పాఠాలు చెప్పకుండా పాడు పనులు చేస్తున్న టీచర్ ని సస్పెండ్ చేసి మంచి పని చేశారని అంటున్నారు. ఇలాంటి టీచర్ల వల్ల పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటేనే భయపడుతున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.