మహిళలే టార్గెట్ గా ఎన్నో మోసాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పార్ట్ టైమ్ జాబ్ల పేరిట ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన ఒక పార్ట్ టైమ్ జాబ్ మోసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ మహిళ రూ.76 లక్షల వరకు మోసపోయింది.
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. మారుతున్న టెక్నాలజీతో మనిషి జీవనం ఎంత సులభతరం అవుతుందో.. అదే టెక్నాలజీతో మనిషి ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు అంతా ఆన్ లైన్ అయిపోయింది. దానినే అదునుగా చేసుకుని ఎంతో మంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమందిని మోసం చేసి కోట్లలో కాజేశారు. బ్యాంకులు, అధికారులు ఎంత చైతన్య పరిచినా ఎక్కడో ఒక దగ్గర మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ లో నయా మోసం నడుస్తోంది. దానికి బలైన ఒక మహిళ ఏకంగా రూ.76 లక్షలు పోగొట్టుకుంది.
మార్కెట్ లో ఇప్పటికే చాలా మోసాలు చూసుంటారు. ఇప్పుడు తాజాగా మరో మోసం వెలుగు చూసింది. నిరుద్యోగులు, హౌస్ ఫైవ్స్ నే లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు చేస్తున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఇప్పిస్తాం, రూపాయి పెట్టుబడి లేకుండా మీరు ఇంట్రో ఉండే ఈ పని చేయవచ్చు, నెలకు మీరు వేలల్లో ఆదాయం సంపాదించవచ్చు అంటూ మాయ మాటలు చెబుతారు. అలా గురుగ్రామ్ కి చెందిన ఓ మహిళకు పార్ట్ జాబ్ ఆఫర్ చేశారు. మీరు ఏం చేయక్కర్లేదు కేవలం సినిమాలు చూస్తే డబ్బులిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. సినిమాలు చూసి రేటింగ్ ఇస్తే సరిపోతుంది అంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన మహిళ లక్షల్లో డబ్బు పోగొట్టుకుంది.
ఆ పార్ట్ టైమ్ జాబ్ చేసేందుకు ముందుగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత దానిలో లెవల్స్ ని క్లియర్ చేయాలని నమ్మించారు. అందుకు ఆమె కొంత నగదు డిపాజిట్ చేస్తుండాలి. ఆ తర్వాత ఆమె డిపాజిట్ చేసిన మొత్తాన్ని బోనస్ తో సహా తిరిగి ఇచ్చేస్తామంటూ చెప్పుకొచ్చారు. వారి మాటలు నమ్మిన దివ్యా అనే గురుగ్రామ్ లో ఎమ్మెన్సీ కంపెనీలో పని చేసే మహిళ రూ.76 లక్షలు కోల్పోయింది. ఆమె పోలీసులకు కంప్లైట్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. ఆమె ఫిబ్రవరి 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమెను ఎలా మోసం చేశారంటే.. రోజుకు ఒక సెట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ సెట్ లో 28 సినిమాలు ఉంటాయి. వాటికి రేటింగ్ ఇవ్వడం పూర్తి చేస్తే మీకు రూ.10,500 బోనస్ వస్తుందని చెప్పారు. బిట్ మ్యాక్స్ ఫిల్మ్.కామ్ అనే వెబ్ సైట్ లో ఆమె అకౌంట్ క్రియేట్ చేసుకుంది. అందులో నెగెటివ్ బ్యాలన్స్ పోస్ట్ చేయాలని తనకు మెసేజ్ వచ్చింది. అలా డిపాజిట్ చేయకపోతే తనకు ఆ మూవీస్ చూసేందుకు అవకాశం ఉండదని చెప్పారు. ఆమె మొదట రూ.29,500తో మొదలు పెట్టి రూ.76 లక్షల వరకు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత యాప్ లో డిపాజిట్ చేసేందుకు వీలు కాకపోవడంతో ఆమె మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆన్ లైన్ మోసాలకు చిక్కకుండా తెలివిగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరించారు.