కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కవల పిల్లలకు నోట్లో విషం పోసి చంపాలని చూసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ప్రయత్నంలో ఓ చిన్నారి ప్రాణం పోగా తల్లితో పాటు మరో చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందంటే? అది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట. ఇదే గ్రామానికి చెందిన కడెం నవీన్ అనే వ్యక్తికి మమత అనే యువతితో గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కవల పిల్లలు పుట్టడంతో ఆ దంపతులు సంతోషపడ్డారు.
కానీ ఈ మధ్యకాలంలోనే భర్త నవీన్ రోడ్డు ప్రమాదానికి గురై కదలలేని స్థితిలో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే మమతకు అత్త లక్ష్మికి మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. భర్త రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, అత్త వేధింపులకు గురి చేయడం వీటన్నిటిని చూసి మమత తట్టుకోలేకపోయింది. ఒకానొక సమయంలో భర్త నవీన్ కూడా భార్యను వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల మరోసారి అత్తతో పాటు భర్త కూడా మమతతో గొడవకు దిగాడు. ఇక తట్టుకోలేకపోయిన మమత తన ఇద్దరు కవల పిల్లలతో ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంది.
ఈ వేధింపులను భరిస్తూ బతకడం నా వల్ల కాదునుకుందో ఏమో తెలియదు కానీ.. ఆ కవల పిల్లల నోట్లో ఎలుకల మందు పోసింది. అనంతరం అదే ఎలుకల మందు తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక ఎంత సేపటికి మమత బయటకు రాకపోవడంతో అనుమానమొచ్చిన కుటుంభికులు వెంటనే తలుపులు బద్దలు కొట్టి చూశారు. తలుపులు తెరిచి చూడగా.. చిన్నారులు, మమత నోట్లో నుంచి నురగలు కక్కుతూ పడి ఉన్నారు. వెంటనే అలెర్ట్ అయి అత్తింటి కుటుంభికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఓ చిన్నారి ప్రాణాలు పోగా మరో చిన్నారి, తల్లి మమత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మమత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అత్తింటి వేధింపుల కారణంగానే మమత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మమత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్థానికంగా ఈ ఘటన విషాదంగా మారింది. అత్తింటి వేధింపులు కారణంగా పిల్లలతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మమత తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.