ఇన్స్టారీల్స్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. రైల్వే ట్రాక్ పక్కన వీడియో తీస్తుండగా అతడ్ని రైలు వచ్చి ఢీకొట్టింది. దీంతో అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ప్రస్తుతం కాలంలో నూటికి తొంభై శాతం మంతి ఫోన్లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పక్కన ఉన్న వారిని కూడా పట్టించుకోకుండా సెల్ ఫోన్ లో మునిగి పోతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలని భావిస్తూ ఉన్నారు. యూటూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్, కొత్తప్రదేశాలలో సెల్ఫీలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. షార్ట్ వీడియోలు చేయడం.. సోషల్ మీడియాలో అప్ డేట్ చేయడం.. పిల్లల నుండి పెద్దల దాకా ఇదే పనిగా మారిపోయింది. ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఫేమ్ కోసం వీడియోలు చేస్తున్నారు. తాజాగా, ఇన్ స్టా మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన శుక్రవారం సనత్ నగర్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రహ్మత్ నగర్ శ్రీరామ్ నగర్ కు చెందిన మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ సర్పరాజ్. ఇతడు స్థానిక మదర్సాలో చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సర్పరాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ పై ఇన్ స్టా షూట్ కి వెళ్లాడు. ఎంఎంటీఎస్ రైలుకు అతి సమీపంలో నడుచుకుంటూ ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే లింగంపల్లి నుంచి సనత్ నగర్ మీదుగా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ అతడ్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్పరాజ్ అక్కడిక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.