సనత్ నగర్ బాలుడి హత్య ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో తాజాగా సంచలన నిజాలు బయటపడ్డాయి.
హైదరాబాద్ సనత్ నగర్ లో బాలుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు స్పందించి.. ఓ హిజ్రా అభం, శుభం తెలియని 8 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చి హత్య చేసిందని ఆరోపించారు. ఇక వెంటనే స్పందించిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఓ నాలాలో ఆ బాలుడి మృతదేహం దొరికింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. కానీ, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఇది నరబలి కాదని తేలింది.
అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సనత్ నగర్ లోని వసీంఖాన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఇతడు అల్లాదున్ కోఠిలో దుస్తుల వ్యాపారాన్ని నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే వసీంఖాన్ స్థానికంగా ఉండే ఫిజాఖాన్ అనే ఓ హిజ్రా వద్ద చిట్టీలు వేసేవాడు. కొన్ని నెలల పాటు వసీంఖాన్ చిట్టీ డబ్బులు చెల్లించాడు. కానీ, ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కొన్ని నెలల చిట్టీ డబ్బులు చెల్లించలేదు. ఇదే విషయంపై ఫిజాఖాన్, వసీంఖాన్ మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవ జరుగుతుంది. ఇక గురువారం కూడా వీరిద్దరూ మరోసారి గొడవ పడ్డారు. ఇదే కోపంతో వసీంఖాన్ కుమారుడు (8)ని ఫిజాఖాన్ ఐదుగురి వ్యక్తుల సాయంతో అపహరించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ బాలుడిని దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ బాలుడి ఎముకలు విరిచి బకెట్ లో కుక్కి ఆ మృతదేహాన్ని జింకలవాడ పరిధిలోని ఓ నాలాలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే సాయంత్రం అయినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి వసీంఖాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికాడు. అయినా కుమారుడి ఆచూకి దొరకలేదు. ఇక చేసేదేంలేక వసీంఖాన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆ బాలుడిని అపహరించిన ఐదుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ తాజాగా స్పందిస్తూ.. ఆర్థిక వ్యవహారల కారణంగానే ఆ బాలుడిని హత్య చేసి నాలాలో పడేసినట్లు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఆర్థిక వ్యవహారాల కారణంగా అభం, శుభం తెలియని 8 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.