జూబ్లీహిల్స్, ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు గుప్పుమంటున్నాయి. దీంతో పోలీసులు.. ఈ కేసులో స్పీడు పెంచారు. ఇప్పటికే.. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక అత్యాచారం ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలిచ్చారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి సైతం స్పందించారు. బాలిక అత్యాచార ఘటనలో నిందితులను కచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టంచేశారు. హోదాతో సంబంధంలేకుండా నిందితులను శిక్షిస్తామన్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించబోమన్నారు. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీచేశామన్నారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు చెప్పారు.
Sure @KTRTRS sir. It is a ghastly incident. Strong action will be taken against all the offenders, irrespective of their background. @TelanganaDGP & @CPHydCity have already been directed to make out efforts & arrest all the accused at the earliest & take strong action as per law. https://t.co/6I7XbCPiUy
— Mohammed Mahmood Ali (@mahmoodalitrs) June 3, 2022
జరిగిన విషయమిదే..
జూబ్లీహిల్స్ పోలీసులు కథనం ప్రకారం.. గత నెల 28న ఓ మైనర్ బాలిక (17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఆమ్నేషియా పబ్ కు స్నేహితులతో కలిసి వచ్చింది.అదే రోజు.. సుమారు 150 మంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు అక్కడే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక.. పార్టీ కాసేపట్లో ముగుస్తుందనగా పబ్ నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో.. అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8 మంది యువకులు అక్కడి నుంచి బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు. మరో ప్రజాప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు.
అనంతరం బాలిక.. ప్రజాప్రతినిధి కుమారుడు, అతని స్నేహితులు నలుగురితో కలిసి ఇన్నోవా కారు బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు బాలికపై సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను 7.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని పబ్ వద్ద వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గట్టిగా ఆరా తీశారు. దీంతో బాలిక అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఐదుగురు కారులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పడంతో.. ఆమె తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇన్నోవా కారులో 16, 17 ఏళ్ల బాలురు ఉన్నారని, వారిలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం బెంజ్ కారును పోలీసులు సీజ్ చేశారు.
ఇప్పిటికే.. అత్యాచార వ్యవహారంలో నలుగురు నిందితులపై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనలో బాలికను పబ్ కు తీసుకెళ్లిన హాడీని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హాడీని బురిడి కొట్టించి అమ్మాయిని కార్లో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు నలుగురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పబ్, బేకరీ సీసీ ఫుటేజ్ ను సైతం పోలీసులు కలెక్ట్ చేశారు.