ఈ మద్య పలు చోట్ల గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు.. తీవ్రంగా గాయపడుతున్నారు.
ప్రమాదాలు ఎటునుంచి ముంచుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్తితి నెలకొంది. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా చనిపోవడం.. గాయాలపాలై ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. ఇటీవల తరుచూ గ్యాస్ సిలిండర్ పేలుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైద్రాబాద్ దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం బోనాల సందడి నడుస్తుంది. బోనాల పండుగ సందర్భంగా ఇంట్లో పిండి వంటలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు వ్యాపించడంతో కుటుంబంలోని ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే స్థానికులు గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
హైదరాబాద్ దోమలగూడలో నివాసం ఉంటున్న నాగలక్ష్మి బోనాల పండుగ సందర్భంగా కూతురు-అల్లుడు, బంధువులను ఇంటికి ఆహ్వానించింది. నాగలక్ష్మి చెల్లెలు నాగులు ఆమె భర్త సైతం వచ్చారు. బంధువులతో ఇంటి వాతావరణం సందండిగా ఉంది. ఇంట్లో పిండివంటలు చేస్తుండగా.. అకస్మాత్తుగా గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నాగలక్ష్మి, ధనలక్ష్మి, అభినవ్, శరణ్య , విహార్ (3) నాగలక్ష్మి చెల్లెలు నాగులు తో పాటుమరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారని.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని దోమలగూడ ఇన్ స్పెక్టర్ తెలిపారు. బాధితులంతా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.