హైదరాబాద్, బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్లో చిన్నారిపై అఘాయిత్యం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వలివ్వగా, అఘాయిత్యానికి పాల్పడిన దోషికి కఠిన శిక్ష విధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, బాలిక తల్లిదండ్రులను చిలుకూరి బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ చిన్నారి తల్లిదండ్రులను ఆలయానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషాద కాలం నుంచి బయటపడే ధైర్యాన్ని ఇవ్వడానికి జటాయువు కంకణాలను వారి మణికట్టుకు కట్టారు.
ఈ సందర్బంగా మీడియా మాట్లాడిన ఆలయ అర్చకులు..’కుటుంబాన్ని ఓదర్చడానికి తన వద్ద మాటలు లేవని చెప్పుకొచ్చారు. రామాయణంలోని జటాయువు పాత్రను సమాజంలో ప్రతి ఒక్కరూ పోషించాలని, అలాంటి సమాజం కావాలని పేర్కొన్నారు. సీతా మాతను కాపాడటానికి జటాయువు రావణుడిపై తీవ్ర పోరు చేశాడని వివరించారు. సమాజంలో మహిళలకు భద్రత కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని, కానీ, అవి ఈ ఉన్మాదుల నుంచి మహిళలను రక్షించలేవని తెలిపారు. అలాగే ఈ అఘాయిత్యాలకు పాల్పడేవారిని ‘రేపాసురులు’గా గుర్తించాలని, వారిని నరికేయాలని లేదా ఉరి తీయాలని సూచించారు.
మరోవైపు చిన్నారిపై వేధింపులకు పాల్పడిన రజినీ కుమార్ నేర చరిత్ర గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రజినీ కుమార్ మరికొంత మంది విద్యార్థినిలతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు అనుమానిస్తున్నారు. రజినీ కుమార్ మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. 11 ఏళ్లుగా స్కూల్ ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ మాధవి దగ్గర కారు డ్రైవర్ గా పని చేస్తున్న అతను, స్కూల్ టీచర్స్ వద్ద అజమాయిషీ ప్రదర్శించేవాడని పోలీసులు గుర్తించారు. ప్రిన్సిపాల్ దగ్గర ఉండే వ్యక్తి కావడంతో టీచర్స్ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరించేవారట. ఇదే అదునుగా భావించిన రజినీ కుమార్.. చిన్నారులను తరగతి గదుల్లోకి తీసుకెళ్లడం లాంటివి చేసేవాడని తెలుస్తోంది.