నేటి యువతలో చదువులు మెండుగా ఉంటున్నాయి కానీ, ఆలోచనా శక్తి మాత్రం అథో: పాతాళంలో ఉంటుంది. ఒడిదుడుకులను ఎదుర్కొనే విషయంలో యువతీ యువకులు వెనకబడిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకే మానసికంగా కుంగిపోతున్నారు.
నేటి యువతలో చదువులు మెండుగా ఉంటున్నాయి కానీ, ఆలోచనా శక్తి మాత్రం అథో: పాతాళంలో ఉంటుంది. ఒడిదుడుకులను ఎదుర్కొనే విషయంలో యువతీ యువకులు వెనకబడిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకే మానసికంగా కుంగిపోతున్నారు. చదువుల్లో మార్కులు రావడం లేదని, ప్రేమించిన వ్యక్తులు ప్రేమకు, పెళ్లికి అంగీకరించలేదని, తమ సమస్యలను వినేవారు లేరని ఆవేదన చెంది మనస్థపానికి గురౌతున్నారు. బతుకు భారంగా తోస్తుండటంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తనతో ఎవ్వరూ మాట్లాడటం లేదని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది.
తనతో ఎవ్వరూ మాట్లాడకపోవడంతో ఒంటరి తనానికి గురై యువతి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బహుదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రయ్య కుమార్తె సౌజన్య డిగ్రీ ఫెయిలై ఇంటి వద్దనే ఉంటోంది. అయితే అప్పటి నుండి ఆమెతో స్నేహితులు, ఇతరులు సరిగా మాట్లాడం లేదు. దీంతో ఆమె ముభావంగా ఉండసాగింది. గత నెల 28న ఇంట్లో చెప్పకుండా వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. వెతికినా కనిపించకపోవడంతో దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే బహుదూర్ పల్లి సమీపంలో ఉన్న చెరువులో సౌజన్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూసైడ్ నోట్ కూడా దొరికినట్లు తెలుస్తోంది. అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.