అబ్బాయిలతో పోలిస్తే తాము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. చదువు, ఆట పాటల్లోనే.. అంతరిక్షంలోకి కూడా సై అంటున్నారు. ప్రతి విషయంలోనూ మగవారితో సమానంగా పోటీ పడుతున్నారు.
అబ్బాయిలతో పోలిస్తే తాము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. చదువు, ఆట పాటల్లోనే.. అంతరిక్షంలోకి కూడా సై అంటున్నారు. ఒక్కో సమయంలో తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. ప్రతి విషయంలోనూ మగవారితో సమానంగా పోటీ పడుతున్నారు. తాము ఎందులోనూ తగ్గేదీ లేదంటూ ముందుకు దూసుకెళుతున్నారు. అయితే అత్యుత్సాహంతో కొంత మంది మహిళలు.. మోసం చేయడంలో కూడా తమదే అంద వేసిన చేయిగా మారాలని ప్రయత్నిస్తున్నారు. చీటింగ్ చేయడంలో పురుషులను మించి పోతున్నారు. మాటలతో బురిడీ కొట్టించి.. దోచుకెళుతున్నారు కిలాడీ లేడీలు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ మహిళ కూడా ఇదే కోవకు చెందినది.
చూడటానికి అ‘మాయకురాలి’గా కనిపిస్తున్న ఈ చిన్నది పోలీసులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇంతకు ఆమె చేసిన పనేంటో తెలుసా.. తన మాయల గారడీతో ఇట్టే బుట్టలో పడేస్తుంది. ఆ తర్వాత తన పని కానిచేస్తుంది. దీంతో బాధితుల సంఖ్య పెరిగిపోయింది. పోలీస్ స్టేషన్లో ఈ వగలాడిపై కేసులు కూడా ఎక్కువయ్యాయి. చివరకు ఆమెను పట్టిస్తే పదివేలు ఇస్తామని రివార్డు ప్రకటించారు అంటే పోలీసులకు ఆమె ఎంత తలనొప్పిగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు మాయల మరాఠి, కిలాడీ లేడీ పేరు జగదాంబ అలియాస్ బుజ్జి. ఇంతకు ఆమె సాగించే రాచకార్యాలన్నీ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో.
ఒంటరిగా ఉన్న మహిళలే ఆమె టార్గెట్. వల వేసి, అదును చూసి ఇంట్లోకి వెళ్లి మహిళలతో మాటలు కలుపుతుంది. బాగా తెలిసిన వ్యక్తిలా మాట్లాడుతుంది. యోగ క్షేమాలు, ఇతర సమాచారం అడిగి తెలుసుకుంటుంది. ఆ తర్వాత నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి వాళ్లు స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అనంతరం ఒంటి మీద, ఇంట్లో ఉన్న బంగారం, ఇతర నగదుతో ఉడాయిస్తుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఆమె కోసం వెతికి వేశారిపోయారు. దీంతో మోస్ట్ వాటెండెట్ క్రిమినల్గా మారిపోయింది. చివరకు ఆమెను పట్టిస్తే రూ. 10 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. పైన ఫోటోలో ఉన్న మహిళ జగదాంబ కనిపిస్తే.. 9491326456 లేదా 996333265 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే కొత్త వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.