పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి వెళ్తూ నిర్లక్ష్యంగా, అతివేగంతో కారు నడిపి తల్లీకూతుళ్ల మృతికి కారణమయ్యాడు ఓ యువకుడు. లైసెన్స్ లేకున్నా డ్రైవింగ్ చేసి ఆ ఘోరానికి కారకుడయ్యాడు. ఆ యువకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమయ్యాడు?
రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన చర్యలు చేపట్టినప్పటికి వాటిని వాహనదారులు పెడచెవిన పెడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కఠినమైన రూల్స్ తీసుకు వచ్చినప్పటికి వాహనదారులు వాటిని ఉల్లంఘిస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడిపి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తల్లీకుమార్తెల మృతికి కారణమయ్యాడు. నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి ఇంతటి ఘోరానికి కారణమయ్యాడు. మార్నింగ్ వాక్ కోసం బయటికి రావడమే వారికి శాపమైంది. కాగా ఈ దారుణానికి కారకుడైన యువకుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలు మీకోసం..
ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూ, నిబంధనలను అతిక్రమించిన వారికి చలాన్లు విధిస్తున్నప్పటికి కొందరు వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన మహ్మద్ బబ్రుద్దీన్ ఖాదిర్ అనే యువకుడు నిర్లక్ష్యంగా కారు నడిపి తల్లీకుమార్తెల మృతికి కారణమయ్యాడు. మహ్మద్ బబ్రుద్దీన్ ఖాదిర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి ఫాం హౌస్ లో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పటికి ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజన్సీ వద్ద కారును రెంటల్ కు తీసుకున్నాడు. ఆ కారులో తన ఫ్రెండ్స్ అయిన ఇబ్రహీం, గణేష్, ఫైజాన్ తో కలిసి ఉదయం వేళ బయలుదేరాడు.
సన్ సిటీ దగ్గరకు చేరుకోగానే సుమారు 120 కి.మీ వేగంతో ఉన్న కారు మలుపు దగ్గర అదుపు తప్పింది. ఆ సమయంలో మార్నింగ్ వాక్ కోసం వచ్చిన అనురాధ, మమత, కవితను కారు ఢీకొట్టింది. దీంతో తల్లీకుమార్తెలైన అనురాధ, మమత అక్కడిక్కడే మరణించగా కవిత తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన కవితను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరానికి కారణమైన మహ్మద్ బబ్రుద్దీన్ ఖాదిర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన ఆ యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.