హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి తన బెంజ్ కార్ డ్రైవర్ ఊహించని షాకిచ్చాడు. కోకాపేటలో స్థలం కొన్న తాలూకు డబ్బును.. స్థలం యజమానికి డబ్బులిచ్చి రమ్మని పంపిస్తే.. రూ.55 లక్షలతో ఉడాయించాడు. గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ నగదు పరారయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10సి ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్రెడ్డి వద్ద ఆరు నెలల కిందట కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన శ్రీనివాస్ డ్రైవర్గా చేరాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్ రెడ్డి కోకాపేటలో స్థలం కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన డబ్బును కోకాపేటలో నివాసం ఉంటున్న స్థల యమజానికి ఇవ్వమని డ్రైవర్ శ్రీనివాస్కు రూ. 55 లక్షలతో పాటు తన బెంజ్ కారును ఇచ్చి పంపించాడు.
శ్రీనివాస్ కారులో డబ్బులు తీసుకొని బయలు దేరాడు. సాయంత్రం దాటినా కోకాపేట చేరుకోలేదు.. ఈ క్రమంలోనే సంతోష్ ఎందుకో శ్రీనివాస్కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సంతోష్రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కారు జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 10లోనే కనిపించింది. డ్రైవర్ శ్రీనివాస్.. నగదు ఏమయ్యాయో తెలియలేదు. శ్రీనివాస్ డబ్బును చోరీ చేశాడా.? లేదా అతనిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.