సాధారణంగా పెళ్లి వేడుకలో పెట్టిన విందు భోజనం బాలేదని, విందు భోజనంలో కావాల్సిన ఆహార పదార్థాలు వడ్డించలేదని గొడవలు చోటుచేసుకోవటం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మటన్, మందు విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ, దిన కర్మ విందులో గొడవలు జరగటం అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. దిన కర్మ విందులో పెరుగు వడ్డించలేదని ఓ కుటుంబంపై విందుకు వచ్చిన వారు దారుణానికి తెగ బడ్డారు. వేడి నీళ్లతో ఆ కుటుంబంపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, మస్రాజ్ గ్రామానికి చెందిన లల్లు కుమార్ బంధువైన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం చనిపోయింది. సోమవారం రాత్రి కుటుంబసభ్యులు దినకర్మ విందును ఏర్పాటు చేశారు. విందు సందర్బంగా పెరుగు మొత్తం అయిపోయింది.
ఈ నేపథ్యంలో బంతిలో కూర్చున్న పొరిగింటి వ్యక్తి అయిన కృష్ణ కుమార్తో పాటు మరికొంతమంది యువకులు విందు ఏర్పాటు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంటి సభ్యులతో గొడవ కూడా పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పట్టలేని ఆగ్రహంతో మహిళలు, పిల్లలపై వేడి నీళ్లు పోశారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గరలోని సదర్ హాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.