మే 29, 2022
రాజస్తాన్లోని జైపూర్కు చెందిన పవన్ శర్మ ఇంటినుంచి కనిపించకుండా పోయాడు. అతడు కనిపించకుండా పోవటంతో కుటుంబసభ్యులంతా ఎంతో వెతికారు కానీ, అతడి ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో అతడి భార్య రీమా ఎంతో అల్లాడిపోయింది. భర్త బాగా ఉండాలని కోరకుంటూ మే 30న అమావాస్య రోజున పూజలు కూడా చేసింది. ఉపవాసం కూడా ఉంది. కుటుంబసభ్యుల కోసం మంచి మంచి పిండి వంటలు వండి పెట్టింది. రోజులు గడుస్తున్నా పవన్ వస్తాడని భావిస్తున్న వారికి నిరాశే ఎదురైంది. నెలలు గడుస్తున్నా అతడి ఆచూకీ మాత్రం తెలియలేదు. పవన్ తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భావించాడు. అయితే, కోడలు ఇందుకు ఒప్పుకోలేదు. కుటుంబం పరువు పోతుందని మామను అడ్డుకుంది.
అక్టోబర్ 13, 2022
భర్త నెలలు గడుస్తున్నా తిరిగి రాకపోవటంతో రీమా ఎంతో కుమిళిపోయింది. ఎక్కడ ఉన్నా ఆయన బాగుండాలని పూజలు చేస్తూ ఉంది. అక్టోబర్ 13న కార్వా పూజను చేసింది. ఆమె పతి భక్తికి పవన్ కుటుంబసభ్యులు సంతోషించారు. తమ కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని భావించారు. ఈ నేపథ్యంలోనే కుమారుడి ఆచూకీ కోసం పవన్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అక్టోబర్ 16, 2022
అర్థరాత్రి సమయంలో పవన్ తండ్రికి మూత్రం రావటంతో పోయటానికి ఇంటి బయటకు వచ్చాడు. మూత్రం పోసి ఇంట్లోకి తిరిగి వెళుతుండగా కోడలి రూములోంచి కొన్ని శబ్ధాలు వినిపించసాగాయి. ఆయన చప్పుడు చేయకుండా కోడలి రూము దగ్గరకు వెళ్లాడు. కోడలు మరో వ్యక్తితో చూడకూడని స్థితిలో ఉండటం ఆయన గమనించాడు. బాగా చూస్తే అతడు భాగేంద్ర అనే వ్యక్తి. వెంటనే పవన్ తండ్రి బయటినుంచి రూము తలుపు బిగించాడు. ఆ వెంటనే భాగేంద్ర తండ్రికి సమాచారం ఇచ్చాడు. భాగేంద్ర తండ్రి అక్కడికి వచ్చి పవన్ కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. కొడుకును విడిపించుకుని పోయాడు. ఈ సంఘటన తర్వాత పవన్ తండ్రికి కోడలిపై అనుమానం వచ్చింది. పోలీసులకు దీనిపై సమాచారం ఇచ్చాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించారు. అసలు విషయం బయటపడింది.
మే 29, 2022
అర్థరాత్రి సమయంలో..
రీమాకు భాగేంద్రకు చాలా కాలం నుంచి వివాహేతర సంబంధం నడుస్తోంది. దీంతో అప్పుడప్పుడూ ఇద్దరూ ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. మే 29న కూడా ఇద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఈ సమయంలో పవన్ వారిని చూశాడు. దీనిపై ఇద్దర్నీ నిలదీశాడు. గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. దీంతో రీమా, భాగేంద్రలకు భయం పట్టుకుంది. అక్రమ సంబంధం విషయం బయటకు తెలుస్తుందని భావించారు. వెంటనే పవన్ గొంతునులిమి చంపేశారు. అనంతరం అతడి శవాన్ని ఓ మిత్రుడి సహాయంతో ఊరికి దూరంగా ఉన్న కాల్వ పక్కన పూడ్చి పెట్టారు.