Bhadradri: మందు కోసం, మాంసం కోసం ఈ మధ్య పెళ్లిలలో గొడవలు జరగటం సర్వసాధారణమై పోయింది. సరిపడా మద్యం పోయలేదనో.. ముక్కలు బాగా వెయ్యలేదనో గొడవలు జరిగి.. పెళ్లిళ్లు పెటాకులు అయిన సంఘటనలు కూడా చాలా జరిగాయి. తాజాగా, మద్యం కోసం గొడవ చోటుచేసుకోవటంతో ఓ పెళ్లి రణరంగంగా మారింది. ఇరు కుటుంబాలు రక్తం వచ్చేలా కొట్టుకున్నాయి. చివరకు ఎస్సై వచ్చినా గొడవ ఆగలేదు. అటుతిరిగి ఇటు తిరిగి ఆయనపై దాడికి యత్నించారు. అక్కడి కానిస్టేబుళ్ల సహాయంతో ఆయన తప్పించుకున్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండాకు చెందిన తునగర్ శంకర్, చింతమ్మల కుమార్తె పార్వతికి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన ముండావర్ శంకర్, సత్యమ్మల కుమారుడు విజయ్తో వివాహం నిశ్చయమైంది. గురువారం మధ్యాహ్నం పెళ్లి వేడుకకోసం వరుడి బంధువులు బొంబాయి తండాకు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతోందనగా మద్యం విషయంలో వధువు బంధువులు, వరుడి బంధువులకు గొడవ మొదలైంది. ఆ గొడవ కొద్దిసేపటి తర్వాత మరింత పెద్దదైంది. ఇరు వర్గాలు ఒకరిని, ఒకరు తీవ్రంగా గాయపర్చుకున్నారు. వరుడి బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి.
రక్త పాతం జరిగింది. ఇంతలో ఎవరో 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గొడవను ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే, వాళ్లు ఎంతకీ తగ్గకపోవటంతో గాయపడ్డవారిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఇందుకు వధువు బంధువులు ఒప్పుకోలేదు. తమ గ్రామానికి వచ్చి తమవారిపై దాడి చేసిన వారిని ఎలా వదిలిపెడతామని ఎస్సైనే నిలదీశారు. కొంతమంది ఎస్సైపైకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుళ్లు ఆయనకు రక్షణగా నిలిచి, పక్కకు తీసుకువచ్చారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, కొన్ని గంటల తర్వాత గాయపడ్డవారు ఆసుపత్రిలో చేరారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nizamabad: నెల రోజుల్లో పెళ్లి.. హఠాత్తుగా మరణించిన వైద్య విద్యార్థి మృతిపై అనుమానాలు!