బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్య కేసులో పోలీసులు హరితో పాటు అతడి స్నేహితుడు హసన్, ప్రియురాలిని అరెస్ట్ చేశారు. ఇక యువతి చేసిన నేరం స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు. మరి యువతికి ఏ శిక్ష పడుతుంది అంటే..
అబ్దుల్లాపూర్మెట్లో బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్యతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. పట్టుమని 20 ఏళ్లు లేని యువకుడిలో ఇంత ఉన్మాదం ఉండటం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. హరిహరకృష్ణ హత్య చేసిన తీరు చూసి పోలీసులే భయపడ్డారు అంటే ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థం అవుతోంది. ఇక ఈ కేసులో మొదటి నుంచి యువతి తీరుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆమె ప్రొద్భలంతోనే హరి ఇంత దారుణానికి ఒడి గట్టి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా యువతి కోసమే హరి.. స్నేహితుడు నవీన్ను నమ్మించి దారుణంగా హత్య చేశాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో భాగంగా యువతి పాత్రపై ఆరా తీసిన పోలీసులు.. తాజాగా సోమవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
నవీన్ హత్య కేసులో పోలీసులు తొలుత హరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక సోమవారం నాడు హరి స్నేహితుడు హసన్ని, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకుని.. హయత్నగర్ కోర్టు ముందు హజరు పరిచారు. న్యాయస్థానం వీరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో యువతి పాత్ర చాలా తక్కువగా ఉంది. ఆమెకు నవీన్ హత్య గురించి ముందుగా ఏం తెలియదు. హరి ఆమెకు నవీన్ శరీర భాగాల ఫొటోలు పంపితే.. జోక్ అనుకుంది. కానీ అతడు వచ్చి.. నవీన్ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత నమ్మింది. హత్య జరిగిన తర్వాత ఆమెకు తెలిసినప్పటికి.. దాని గురించి పోలీసులకు తెలపలేదు. ఇక హరి డబ్బులు అడిగితే.. తెలిసిన అబ్బాయిగా భావించి.. అతడికి డబ్బులు ఇచ్చింది. ఇక్కడ యువతి చేసిన తప్పు ఒక్కటే. నేరం గురించి తెలిసిన తర్వాత పోలీసులకు చెప్పలేదు. అది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కిందకు వస్తుంది’’ అని తెలిపింది డీసీపీ.
మరి యువతి చేసిన నేరం స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు. మరి ఈ నేరానికి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే.. ఐపీసీ సెక్షన్ 201, 212 స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ నేరాలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తుంది అంటున్నారు నిపుణులు. యువతి చేసిన నేరం ఏ యాక్ట్ కిందకు వస్తుందో పోలీసులు ఇంకా స్పష్టంగా తెలపలేదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే యువతికి ఐసీపీ సెక్షన్ 201, 212 వీటిల్లో ఏదైనా ఒక సెక్షన్ కింద శిక్ష పడవచ్చు అంటున్నారు.
ఐపీసీ సెక్షన్ 201 అంటే.. సాక్ష్యాలను కనపడకుండా చేయడం కిందకు వస్తుంది. దీని ప్రకారం ఏ1కు పడే శిక్షలో నాలుగో వంతు వీరికి పడుతుంది. అలానే 212 అనేది నేరస్థుడికి ఆశ్రయం ఇవ్వడం కిందకు వస్తుంది. వీరికి 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది అని తెలుపుతున్నారు. అయితే ఈ దారుణంలో యువతి పాత్ర గురించి పూర్తిగా తెలియలేదు కనుక.. దర్యాప్తు పూర్తయ్యేసరికి ఈ సెక్షన్లు మారే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిపుణులు. మరి యువతికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.