సమాజంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మేకప్ సరిగ్గా వేయలేదని ఓ నవ వధువు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు ఘటనలో ఏం జరిగింది? నిజంగానే ఆ నవ వధువు మేకప్ సరిగ్గా వేయని కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది మధ్యప్రదేశ్ లోని జబల్ పురా పరిధిలోని కొత్వాలి ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ యువతిది డిసెంబర్ 3న వివాహం.
ఇక ఆ యువతి పెళ్లి రోజు సందర్భంగా మేకప్ వేయించుకోవడానికి ఇటీవల స్థానికంగా ఉండే మౌనిక మేకప్ స్టూడియోకి వెళ్లింది. పెళ్లి కూతురుకి మేకప్ వేయడానికి రూ. 3500 ఖర్చు అవుతాయని చెప్పడంతో ఆ పెళ్లి కూతురు మేకప్ ఓనర్ కు ఆ డబ్బులు పూర్తిగా చెల్లించింది. ఇక పెళ్లి రోజు మౌనిక మేకప్ స్టూడియో నుంచి కొందరు వ్యక్తులు వచ్చి ఆ పెళ్లి కూతురుకు మేకప్ వేశారు. పెళ్లి కూడా జరిగిపోయింది. కానీ మేకప్ సరిగ్గా వేయలేదని ఆ పెళ్లి కూతురు తీవ్ర కోపానికి గురైంది. అయితే ఇదే విషయంపై ఆ పెళ్లి కూతురు ఇటీవల కోత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా పెళ్లి రోజు సందర్భంగా మేకప్ వేస్తామని డబ్బులు తీసుకుని మేకప్ సరిగ్గా వేయలేదని ఆ నవ వధువు ఫిర్యాదులో పేర్కొంది. ఆ నవ వధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.