ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. అందరూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా సాగాయి. యువత అంతా అర్ధరాత్రి వరకు వేచి చూసి 12 గంటలకు కేకులు కోసి న్యూ ఇయర్ శుభాాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సంవత్సరం అందరికీ ఆనందాలను, సంతోషాలను పంచాలంటూ ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటుతుంటే హైదరాబాద్ బంజారాబిల్స్ రోడ్ నంబర్ 3లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. జూబ్లీచెక్ పోస్టు నుంచి పంజాగుట్ట వెళ్లే మార్గంలో టిఫిన్ సెంటర్ వద్ద రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఆ కార్లను మరో కారు వచ్చి వేగంగా ఢీ కొట్టింది. ఆదివారం ఉదయం ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం సమయంలో ఎయిర్ బ్యాగులు కూడా ఓపెన్ అయ్యాయి. మొత్తం 3 కార్లు ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయ్యాయి. కారు నడిన వ్యక్తి, కారులో ఉన్న మరో వ్యక్తి కూడా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో కారుని వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తులకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.