ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపోయింది. ఏం పని కావాలన్నా ఆన్ లైన్ లోనే చేసేసుకుంటున్నారు. టెక్నాలజీ అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. డబ్బులు ఎవరికైనా పంపించాలంటే క్షణాల్లో ఫోన్ తీసి.. యాప్ ఓపెన్ చేసి పంపించేస్తున్నారు. ఇక బ్యాంకుకి వెళ్లే పని ఏముంటుంది చెప్పండి. కానీ కొన్ని సార్లు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకులకు వెళ్లడం అంటే ఏంటో మర్చిపోయిన జనాలకు ఒక్కోసారి బ్యాంకులకు వెళ్లాలంటే పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది. బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేసి.. సార్ రీకేవైసీ కోసం బ్యాంకుకి రావాలండి అని విసిగిస్తా ఉంటారు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యింది కదా.. ఆన్ లైన్ లో రీకేవైసీ చేసుకునే సదుపాయం కల్పించవచ్చు కదా అని తిట్టుకుంటూనే బ్యాంకులకు వెళ్తాం.
మరి కొంతమంది ఐతే ఊళ్లలో బ్యాంకు ఖాతాలు ఉండి.. ఎక్కడో ఊళ్ళకి దూరంగా సిటీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. ఇంకొంతమంది ఐతే వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. పనిగట్టుకుని రీకేవైసీ కోసం 300, 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం ఎలా అని ఆగిపోయే వాళ్ళు చాలా మందే ఉంటారు. మరి రీకేవైసీ చేయించుకోకపోతే ఈ బ్యాంకోళ్లు బ్యాంకు అకౌంట్లు క్లోజ్ చేసి పడేస్తారే. అబ్బా ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా ఉందని చాలా మంది ఫీలవుతున్నారు. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకు వాళ్లకి కొత్త ఆదేశాలు జారీ చేసింది. రీకేవైసీ కోసం ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ఖాతాదారులు రీకేవైసీ ప్రక్రియను ఆన్ లైన్ లో చేసుకోవచ్చునని వెల్లడించింది. అయితే ఒక్క చిరునామా మార్పు కోసం బ్యాంకుకి తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని వెల్లడించారు. ఆర్బీఐ కేవైసీ నార్మ్ గైడ్ లైన్స్ ప్రకారం.. బ్యాంకులు క్రమంగా ఖాతాదారుల కేవైసీ డాక్యుమెంట్లు ఆర్బీఐకి అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఖాతా తెరిచినప్పుడు ఖాతాదారులు ఎలా అయితే కేవైసీ కోసం డాక్యుమెంట్లు సమర్పిస్తారో.. అలానే రీకేవైసీ కోసం కూడా డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి ఆన్ లైన్ లోనే ఈ రీకేవైసీ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.
డిసెంబర్ 7 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ఇక నుంచి బ్యాంకులు.. రీకేవైసీ కోసం ఖాతాదారులను బ్రాంచులకి రప్పించకుండా ఆన్ లైన్ లోనే డాక్యుమెంట్స్ పొందవచ్చునని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఒకవేళ బ్యాంకులు.. రీకేవైసీ కోసం ఖచ్చితంగా బ్రాంచ్ ని సందర్శించాలి అని పట్టుపడితే .. పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. మరి ఇక నుంచి రీకేవైసీ కోసం డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి వస్తే బ్యాంకుకి వెళ్లకుండా ఆన్ లైన్ లోనే చేసుకోండి.