ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీకి భారత్లో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ మన దేశ మార్కెట్ను వినియోగించుకోవడంలో మారుతి సంస్థ ఫుల్ సక్సెస్ అయ్యింది. మిగతా కార్ల కంపెనీలకు భిన్నంగా ఆలోచిస్తూ దూసుకెళ్తోందీ సంస్థ. ఇక్కడి వినియోగదారుల అవసరాల దృష్ట్యా తన ఉత్పత్తులను తక్కువ ధరలకే విక్రయిస్తోంది. మైలేజీ విషయంలోనూ మారుతీకి మిగతా కార్లు సాటిరావు. తక్కువ ధరతో అత్యాధునిక ఫీచర్లు, మంచి మైలేజీని అందిస్తోంది కాబట్టే మారుతి కార్ల సేల్స్ ప్రతి ఏటా అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. మారుతి సుజుకి పెద్ద సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తోంది.
2022 డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈ సంవత్సరం జనవరి 12వ తేదీ మధ్య తయారైన కార్ల ఎయిర్ బ్యాగ్స్ కంట్రోలర్లలో లోపం తలెత్తే చాన్స్ ఉందని మారుతి సుజుకీ చెబుతోంది. ఈ లోపం ఉన్న కార్లలో సీట్ బెల్టులు పనిచేయకపోవచ్చునని, యాక్సిడెంట్ జరిగితే ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవచ్చని గుర్తించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుకే 17,362 కార్లను మారుతి కంపెనీ రీకాల్ చేస్తోంది. ఇలా వెనక్కి పిలిపిస్తున్న కార్లలో గ్రాండ్ విటారా, బ్రెజా, ఆల్టో కే10, ఈకో, బాలెనో, ఎస్ ప్రెసో మోడళ్లు ఉన్నాయని మారుతి సుజుకి ఓ ప్రకటనలో పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో లోపాలు ఉంటే సరిదిద్ది కస్టమర్లకు తిరిగి అప్పగిస్తామని వివరించింది. దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని మారుతి స్పష్టం చేసింది. కారు తనిఖీలతోపాటు మరమ్మతులు పూర్తిగా ఉచితమని తెలిపింది.