బిగ్ బాస్ తెలుగు షో జరగడం ఏమో కానీ ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూన ఉంటాయి. ప్రస్తుతం ఆరో సీజన్ లో 52 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇక సీజన్ ప్రారంభంలోనే సీపీఐ నారాయణ బిగ్ బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీలతని ప్రోత్సాహిస్తున్నారని.. ఓ పరుష పదజాలం ఉపయోగించి మరీ హోస్ట్ నాగార్జునని తిట్టిపోశారు. నిర్వహకులు మాత్రం అవేం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నాగ్ మాత్రం బిగ్ బాస్ హౌసులోని మెరీనా-రోహిత్ కి హగ్ చేసుకోమని చెప్పాడు. మీకు లైసెన్స్ ఉందని చెప్పి, ఇన్ డైరెక్ట్ గా నారాయణకు కౌంటర్స్ వేసినట్లు అనిపించింది! ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నట్లు కనిపించింది కానీ వ్యవహారం మాత్రం ఏపీ హైకోర్టుకు చేరింది.
మూడేళ్ల క్రితం సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడి.. బిగ్ బాస్ షో ఆపేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని స్వీకరించిన ధర్మాసనం.. ఆ షోలోని రెండు మూడు ఎపిసోడ్స్ పరిశీలిస్తామని గతంలోనే చెప్పింది. తాజాగా విచారణ చేసి షో ఆర్గనైజర్స్ తోపాటు హోస్ట్ నాగార్జునకు కూడా నోటీసులు జారీ చేసింది. తక్షణమే కౌంటర్ దాఖలు చేయాలని సదరు నోటీసుల్లో పేర్కొంది. విచారణని రెండు వారాలు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా కేతిరెడ్డి పిటిషన్ ప్రకారం.. బిగ్ బాస్ ఎపిసోడ్స్.. ఎలాంటి సెన్సార్ లేకుండా టీవీల్లో ప్రసారం చేస్తున్నారని, దీంతో అశ్లీలత ప్రోత్సాహించినట్లు అవుతుందని పేర్కొన్నారు.
ఇక షో విషయానికొస్తే.. గత సీజన్లతో పోలిస్తే ప్రస్తుత సీజన్ చాలా ఘోరంగా ఉంది. రేటింగ్స్ దారుణంగా వస్తున్నాయి. కంటెస్టెంట్స్ లో గీతూ, రేవంత్, శ్రీహాన్ తదితరులు తప్పించి మిగతా వారిలో ఒక్కరు కూడా సీరియస్ గా గేమ్ ఆడుతున్నట్లు కనిపించడం లేదు. కొన్ని రోజులు ముందు ఇదే విషయమై సీరియస్ అయిన బిగ్ బాస్.. షో తలుపులు తెరిచి, హౌస్ మేట్స్ ని బయటకెళ్లిపోమని నిర్దాక్షణ్యంగా చెప్పేశాడు. అయినా సరే పెద్దగా మార్పులేం వచ్చినట్లు కనిపించలేదు. ఇలా షో రోజురోజుకి తీసికట్టుగా మారుతున్న ఈ టైంలో.. ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేయడం నిర్వహకులతో పాటు హోస్ట్ నాగార్జునకు తలనొప్పిగా మారింది!