‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారిలో టాప్ 5ని సెలక్ట్ చేస్తారు. ఇప్పటికే సింగర్ శ్రీరామచంద్ర తొలి ఫైనలిస్టుగా అవతరించాడు. టికెట్ టూ ఫినాలే టాస్కులో విజయం సాధించి తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. అందుకోసం చాలా టాస్కులే ఆడాల్సొచ్చింది. టాస్కులకు పాయింట్లు ఇస్తూ చివరికి టాప్ 2 కంటెస్టెంట్లకు ఫైనల్ టాస్కు ఇచ్చారు. మొదటి టాస్కులోనే గాయపడిన శ్రీరామ్ తరఫున బిగ్ బాస్ వేరొకరు ఆడేందుకు అవకాశం ఇచ్చారు. అలా ఒకసారి సన్నీ, ఒకసారి షణ్ముఖ్ గేమ్ ఆడి శ్రీరామచంద్రను గెలిపించారు. ఫైనలిస్టుగా నిలిచేందుకు తమ వంతు సాయం చేశారు.
కూర్చొనే ఆడగలిగే టాస్కులను శ్రీరామచంద్రానే ఆడుకున్నాడు. టైమ్ కౌంట్ చేయడం, సౌండ్స్ ను గుర్తించి రాయడం వంటివి. ఫిజికల్ గా ఉన్న టాస్కులను మాత్రం వేరొకరితో ఆడించాడు. అయితే షణ్ముఖ్ ఆడిన టాస్కు విషయంలోనే ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట సిరి తరఫున గేమ్ ఆడాడు షణ్ముఖ్. మళ్లీ శ్రీరామ్ తరఫున కూడా అదే గేమ్ ఆడాడు. అలా చేయడం వల్ల షణ్ముఖ్ కు ఒక అడ్వాంటేజ్ కలిగింది. అది గేమ్ గురించి ఒక అవగాహన ఉంది. అందుకే సిరి కోసం ఆడినప్పుడు 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకున్న షణ్ముఖ్ తర్వాత శ్రీరామ్ కోసం ఆడే సమయంలో కేవలం 1.49 నిమిషాల్లోనే కంప్లీట్ చేశాడు.
అయితే ఆ ఒక్కటే కాదు. మానస్ తో గేమ్ ఆడే సమయంలో షణ్ముఖ్ అంతా అయిపోయిందని బెల్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో శ్రీరామచంద్ర షణ్ముఖ్ కు హెల్ప్ చేశాడు. ఆ తర్వాత షణ్ముఖ్ మళ్లీ గమనించుకుని గేమ్ ఆడాడు. అయితే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం అది తప్పు. అలా చేయకూడదని ముందే చెప్పారు. కానీ, బిగ్ బాస్ ఆ రూల్ బ్రేక్ చేశారని ఎవరినీ హెచ్చరించలేదు. నేరుగా నిర్ణయం తీసుకుని స్కోర్ ఇచ్చేశారు. ఆ విషయంపై మానస్ అక్కడే తన అసహనాన్ని వ్యక్త పరిచాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్ కూడా విమర్శిస్తున్నారు. తర్వాత టాస్కులో మానస్ కు అదృష్టం కూడా అడ్డం తిరిగి విజయం సాధించలేక పోయాడు. నిజంగానే బిగ్ బాస్ టాస్కులో మానస్ కు అన్యాయం జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.