గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇక అనంతలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో కుండపోత వర్షాలు కురిశాయి. ప్రతి సంవత్సరం వర్షం కోసం పూజలు చేసే రైతాంగం.. ఈ అధిక వర్షాలు నిలుపుదల చేయాలంటూ వరుణ దేవున్ని ప్రార్థించాంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు ఉండడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవటంతో భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరద ముంపు బారినపడిన గ్రామాలను నేడు పరిశీలించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే ఉంటూ లీకేజీ నియంత్రణ పనులను పర్యవేక్షించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం అక్కడే బస చేసారు. ఈ సందర్భంగా బాధిత గ్రామాల ప్రజలకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో వరద ముంపు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూటలను మోసేందుకు చొక్కా విప్పి మరీ రంగంలోకి దిగారు. ఎంతో ఉత్సాహంగా మూటలు మోస్తూ సహాయక చర్యలు సత్వరమే సాగేందుకు తన వంతు కృషి చేశారు.
నేవీ హెలికాప్టర్ ద్వారా వచ్చిన సరకులను తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోనూ, రాయలచెరువు, చిట్టత్తూరు, సి-కాలేపల్లి, పుల్లమనాయుడు కండ్రిగ ప్రాంతాల్లో వరద బాధితులకు పంపిణీ చేశారు. ఇప్పటికే 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చినట్టు తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వరదముంపు ప్రాంత ప్రజలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్ ద్వారా సరుకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే @ChevireddyYSRCP గారు 👏 pic.twitter.com/dQ2zNd9jBw
— YSJ2024 (@YSJ2024) November 23, 2021