విశాఖలో ఓ వాలంటీర్ వృద్ధురాలిని చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో వాలంటీర్ హైటెక్ మోసం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఏకంగా ప్లాస్టిక్ వేలి ముద్రలు వేస్తూ అడ్డంగా బుక్కైపోయాడు.
మూన్ లైట్ వర్క్, ప్రాక్సీ వంటి పదాలను వినే ఉంటారు. ఒక ఆఫీస్ లో పని చేస్తూనే మేనేజ్మెంట్ కి తెలియకుండా వేరే ఆఫీస్ కి పని చేయడాన్ని మూన్ లైట్ వర్క్ అంటారు. అనుభవం లేకపోయినా ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టిన వ్యక్తి బదులు వేరే వ్యక్తి ప్రాజెక్ట్ వర్క్ చేయడాన్ని ప్రాక్సీ అని అంటారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఫేక్ ఎక్స్ పీరియన్స్ తో జాబ్ లో జాయినైన వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ లు వేరే వాళ్ళకిచ్చి పూర్తి చేయిస్తారు. ఇలా చేసినందుకు వాళ్లకి వచ్చిన జీతంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తరహా మోసమే ఓ వాలంటీర్ చేశాడు.
వాలంటీర్ జాబ్ అంటే ఊళ్ళో ఉంటూ ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు సేవలు చేయడం. కానీ ఈ వాలంటీర్ మాత్రం ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఊర్లో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఊరిలో లేకపోయినా సరే పనులు జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. తన ప్లేస్ లో తన సోదరుడిని పెట్టి మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇలా కొన్ని రోజులు మేనేజ్ చేస్తూ వచ్చిన వాలంటీర్ అడ్డంగా బుక్కైపోయాడు. అసలు వాలంటీర్ ఉద్యోగం మొదలయ్యేది వేలి ముద్రలతో. అలాంటిది తను ఊర్లో లేకపోయినా ఆ వాలంటీర్ సోదరుడితో ప్లాస్టిక్ వేలిముద్రలతో మేనేజ్ చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
పామూరు మండలం పడమటి కట్టకిందపల్లి పంచాయతీ పరిధిలోని కందులవారిపల్లిలో రాచగొర్ల గురు ప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతను గ్రామంలో అందుబాటులో లేకుండా బెంగళూరులో ఉంటున్నాడు. మంగళవారం పెన్షన్ డబ్బులను వాలంటీర్ గురుప్రసాద్ బదులుగా ఆయన సోదరుడు గురుస్వామి పంపిణీ చేసినట్లు లబ్ధిదారులు వెల్లడించారు. బయోమెట్రిక్ యంత్రంలో ప్లాస్టిక్ వేలిముద్ర వేసి పెన్షన్ ఇచ్చాడు. కొందరికి పెన్షన్ ఇచ్చి.. కొందరికి ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. తమకు పెన్షన్ ఇవ్వలేదని స్థానికులు సచివాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శి షేక్ జానీకి ఫిర్యాదు చేశారు.