ఇళ్లు అద్దెకు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. మరి ఇంతకు ఏం జరిగింది.. పోలీసులు ఎందుకు ఇలా హెచ్చరికలు జారీ చేస్తున్నారో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
ఏపీలో అందునా విశాఖలో ఇళ్లు అద్దెకు ఇచ్చే ఇంటి యజమానుల్ని పోలీసులు అలర్ట్ చేశారు. కొంతమంది గంజాయి వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. విశాఖలో బట్టల వ్యాపారం చేస్తున్నామని చెప్పి.. ఇళ్లు అద్దెకు తీసుకుని.. ఆ ముసుగులో గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు గుర్తించామని సీపీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. అందుకే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి యజమానులు ఇళ్లను అద్దెకు ఇచ్చేముందు ఇంటి యజమానులు ఆలోచించి ఇవ్వాలని.. అలాగే ఇల్లు అద్దెకు తీసుకున్నవారి కార్యకలాపాలపై కూడా ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. యజమానులు ముందే జాగ్రత్త తీసుకోకపోతే.. ఆ తర్వాత తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని.. గంజాయి అక్రమ రవాణాకు వినియోగించిన ఇంటిని జప్తు చేస్తామని హెచ్చరించారు.
అందుకే బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిదని సీపీ త్రివిక్రమ్ సూచిస్తున్నారు. యజమానులు.. అద్దెకు వచ్చిన వారికి సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాతే ఇల్లు రెంట్కు ఇవ్వాలని తెలిపారు. ఇటీవల వెలుగు చూసిన కొన్ని సంఘటనల కారణంగా తాము ఇలా అప్రమత్తం చేస్తున్నామంటున్నారు. కొందరు వస్త్ర వ్యాపారం ముసుగులో ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచే గంజాయి దందా చేస్తున్నారని సీపీ త్రివిక్రమ్ చెబుతున్నారు. ఈ విషయంలో మరింత అప్రమత్తత అవసరమంటున్నారు. విశాఖపట్నంలోనే కాక.. రాష్ట్రంలో ఎక్కడైనా సరే.. ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు ఎవరైనా సరే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు.
గంజాయి అక్రమ రవాణా చేసే కేటుగాళ్లు పోలీసులకు చిక్కకుండా ఉండటం కోసం రకరకాల మార్గాల్లో అక్రమ రవాణా ప్రయత్నాలు చేస్తూ.. ఎవరికీ దొరక్కుండా గంజాయిని ఊరు దాటించేస్తున్నారు. అంతేకాక గంజాయిని ఆయిల్, టాబ్లెట్ల రూపంలోకి కూడా మార్చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా పెరుగుతోంది. హైదరాబాద్, ముంబై వంటి ప్రాంతాలకు గంజాయిని చేరవేసేందుకు హైదరాబాద్-విజయవాడ హైవేను ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలో హైదరాబాద్ హైవేలో పోలీసులు నిఘా పెంచారు. ఇప్పటికే పలు గంజాయి ముఠాలను పట్టుకుని.. అక్రమంగా రవాణా చేస్తోన్న గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.