ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో రింగు వలలు, సంప్రదాయ వలల వాడే మత్య్సకారుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. పెద్ద జాలరి పేట, వాసవానిపాలెం అనే రెండు గ్రామాల మధ్య మొదలైన రింగు వలల వివాదం.. చివరకు బోటును ధ్వంసం చేసేవరకు చేరి.. రెండు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో ప్రకాశం జిల్లాలో మొదలైన ఈ రింగు వలల వివాదం.. తాజాగా విశాఖ తీరానికి చేరింది. నిషేధించిన రింగు వలలతో చేపల వేటకు వెళ్లడంతో ఈ వివాదం ప్రారంభం అయ్యింది.
వాసవానిపాలెం మత్స్యకారలు 13 బోట్లలో మొదట రింగు వలలతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. దీని గురించి సమాచారం అందుకున్న పెద్ద జాలరిపేట జాలర్లు.. 100 బోట్లలో అక్కడికి చేరుకుని.. వాసవానిపాలెం జాలర్లను ముట్టడించారు. నిషేధించిన రింగు వలలతో చేపల వేటకు రావడం ఏంటని ప్రశ్నించారు. దాంతో వాసవానిపాలెం మత్య్సకారులు వెనుదిరిగారు. అక్కడితో వివాదం ముగిసిపోలేదు. వద్దని చెప్పిన తర్వాత కూడా రింగు వలలతో చేపల వేటకు వచ్చారనే ఆగ్రహంతో.. పెద్ద జాలరిపేట మత్య్సకారులు… వాసవానిపాలానికి చెందిన జాలర్ల బోటును తగులబెట్టారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.
ఇది కూడా చదవండి : ఫుట్ పాత్ పై బిచ్చగాడి డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఫిదా
ప్రస్తుతం వాసవానిపాలెం, పెద్దజాలరిపేట రెండు గ్రామాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక తాజా వివాదంపై మంత్రులు అవంతి, సీదరి అప్పలరాజు స్పందించారు. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని.. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. మంత్రి అవంతి ఫిషింగ్ హార్బర్ లో పర్యటించి.. ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
అసలు ఏంటి ఈ రింగు వలల వివాదం..
రింగు వలలు.. సంప్రదాయ వలలకు పూర్తిగా భిన్నమైనవి. ఇవి చాలా పెద్దగా ఉండటంతో ఒక్కసారి వీటిని విసిరితే.. చేపలన్ని వలలో పడాల్సిందే. చిన్న చేప నుంచి పెద్ద చేపలు వరకు ప్రతిదీ దీనిలో చిక్కుతుంది. ఎక్కువ మొత్తంలో చేపలు లభిస్తాయి. అయితే ఇక్కడ అసలు వివాదానికి కారణంగా మారుతుంది కోనెం చేప. మిగతా చేపలు టన్నుల కొద్ది పడినా.. కోనెం చేపలు కేజీల లెక్కన పడ్డా ఒకటే రకమైన ఆదాయం లభిస్తుంది. ఎందుకంటే వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.
కోనెం చేప కేజీ మూడు వందల రూపాయలు పలుకుతుంది. ఇది సంప్రదాయ వలలో చిక్కదనే చెప్పవచ్చు. కానీ రింగు వలలు వాడినప్పడు కోనెం చేపలు పెద్ద ఎత్తున చిక్కుతాయి. ఫలితంగా సంప్రదాయ వలలు వాడే వారు ఎక్కువగా నష్టపోతున్నారు. అందుకే వారు రింగు వలలు వాడే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రింగు వలల వల్ల చిన్న చేపలు, గుడ్లు పెట్టే చేపలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి : చైనాకి భారత జవాన్లు ధీటైన జవాబు.. గల్వాన్ లోయలో త్రివర్ణ పతాకం!
కోర్టులో వివాదం..
ఈ రింగు వలల వ్యవహారంపై గతంలో కొందరు మత్స్యకారులు కోర్టుకు కూడా వెళ్లారు. ఇంకా తీర్పు రాలేదు. అయితే చాలాకాలంగా ఈ వివాదం నడుస్తుండటంతో.. మంత్రులు, రాజకీయ నేతలు కలుగ చేసుకుని.. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. ఎవరు ఎక్కడ చేపలు పట్టాలనే దాని గురించి ఓ ఒప్పందం చేసుకుని.. సరిహద్దు రేఖ కూడా గీసుకున్నారు. ముఖ్యంగా 8 కిలోమీటర్ల దాటిన తరువాత రింగు వలలతో చేపలు పట్టాల్సి ఉంటుంది.
ఇక సంప్రదాయ మత్య్సకారులు సముద్రంలో 8 కిలో మీటర్ల దూరం దాటి వేటకు వెళితే జరిమానా విధిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి మత్స్యకార సంఘాలు, మెరైన్ ఫిషరీస్ కమిటీ, ఇతర అధికారులతో కలిపి ఒక కమిటీని వేసింది. అయితే తాజాగా జరిగిన వివాదంలో.. ఎవరు నిబంధలను పాటించడం లేదని.. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రెండు గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
ఇది కూడా చదవండి : ‘స్టోన్ మ్యాన్’.. శాస్త్రవేత్తలు కూడా చేతులెత్తేశారు