మన దగ్గర సినీ తారలకు ఉండే అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమాన హీరో, హీరోయిన్ల కోసం ఏం చేయాడానికి అయినా వెనకాడరు. ఇక కొందరైతే.. తమ అభిమాన హీరో వాడిన వస్తువులు, దుస్తులు వంటివి సొంతం చేసుకోవడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఇంతకు ఏం చేశారంటే..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఎంత శక్తివంతమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కెడెక్కడి నుంచో భక్తులు దుర్గమ్మను దర్శించుకోవడానికి తరలి వస్తారు. ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంలో అమ్మవారిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. అమ్మ దర్శనం లభిస్తే.. జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. ఇక విశిష్ట పర్వదినాల సమయంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రముఖులే కాక సామాన్య భక్తులు సైతం అమ్మవారికి తమ శక్తికి తగ్గట్లు వస్త్రాలు సమర్పిస్తారు. ఇలా అమ్మవారికి వచ్చిన చీరలను శారీ కౌంటర్కు పంపడం.. లేదంటే ఎవరైతే సమర్పించారో వారికే తిరిగి ఇవ్వడం చేస్తుంటారు ఆలయ నిర్వహకులు.
ఇక చాలా మంది భక్తులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన తర్వాత.. తాము ఎంత ఖరీదు పెట్టి కొన్నారో.. అంత మొత్తం చెల్లించి తాము దుర్గమ్మకి పెట్టిన చీరను తిరిగి తీసుకెళ్తారు. కొందరు మాత్రం అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలను గుడికే సమర్పిస్తారు. ఇలా వచ్చిన వస్త్రాలకు దేవస్థానం.. రేటు నిర్ణయించి.. వాటిని ఇంద్రకీలాద్రి శారీ కౌంటర్కు పంపిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు దేవస్థానం నిర్ణయించిన మొత్తం చెల్లించి ఆ వస్త్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. సాధారణంగా దుర్గమ్మకు వచ్చే వస్త్రాల విషయంలో ఇలానే జరుగుతుంది. కానీ తొలిసారి అందుకు భిన్నమైన సన్నివేశం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు సమర్పించిన చీరను తిరిగి ఆయనకే పంపించనున్నారు దేవస్థానం అధికారులు. ఎందుకంటే..
పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా వారాహి వాహనాన్ని సిద్ధం చేయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 25న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి ఆలయ అధికారులకు అసలు తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు సమర్పించిన పట్టు చీర మాకు కావాలంటే మాకు కావాలంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలయ అధికారులను కోరుతున్నారట.
అంతేకాక ఈ చీరను చూడటం కోసం రోజుకి పదుల సంఖ్యలో అభిమానులు ఆలయానికి వస్తున్నారని.. ఎక్కడెక్కడి నుంచో తమకు ఫోన్లు చేసి చీర వివరాలు అడుగుతున్నారని శారీ కౌంటర్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు సమర్పించిన చీరను.. తిరిగి ఆయనకే గిఫ్ట్గా పంపించనున్నారు శారీ కౌంటర్ నిర్వాహకులు. మరి దేవుడికి సమర్పించిన వస్త్రాల విషయంలో అభిమానులు ఇలా చేయడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.