విజయవాడ- మాజీ మంత్రి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు భారీ షాక్ తగిలింది. కన్నా దంపతులు, ఆయన కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మీ కీర్తి వేసిన గృహహింస కేసులో కోడలికి రూ. కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ.. విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
కేసు ఏంటంటే..
కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు.. కన్నా నాగరాజు 2006, మే 10న శ్రీలక్ష్మీ కీర్తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2013 లో కుమార్తె కౌశిక జన్మించింది. 2006 నుంచి 2015 వరకు అంతా సాఫీగా సాగిందని బాధితురాలు తెలిపారు. ఆ తర్వాత అత్త విజయలక్ష్మి తనను, బిడ్డతో సహా ఇంట్లో నుంచి బయటకు పంపారని శ్రీలక్ష్మీ ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. ‘‘మా వివాహం జరిగినప్పటి నుంచి అత్త విజయలక్ష్మీ నన్ను మాటలతో వేధించేవారు. మా అమ్మనాన్న నన్ను చూడటానికి వచ్చినా ఇంట్లోకి రానివ్వలేదు. వేరే సంబంధం చేసుకుంటే.. కోట్ల రూపాయల కట్నం వచ్చేదని వేధించేవారు. ఇదిలా ఉండగానే నా భర్త నాగరాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి ప్రశ్నిస్తే.. నన్ను కొట్టాడు. అప్పటి నుంచి నన్ను దూరం పెట్టారు’’ అని తెలిపింది.
ఈ క్రమంలో శ్రీలక్ష్మీ విజయవాడ ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో గృహహింస పిటిషన్ దాఖలు చేశారు. తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని, నివాస వసతి కల్పించాలని, వైద్య ఖర్చులను ఇప్పించాలని పిటిషన్ లో కోరారు. గృహహింస చట్టం ప్రకారం న్యాయస్థానంలో కన్నా నాగరాజు, కన్నా లక్ష్మీనారాయణ, కన్నా విజయలక్ష్మీలను ప్రతివాదులుగా చేర్చారు.
దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. పిటిషనర్ శ్రీలక్ష్మీకి, ఆమె కుమార్తెకు ప్రతివాదులు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిలో నివాస వసతి కల్పించాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ వసతి కోసం నెలకు రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది. రూ.కోటి పరిహారంతో పాటు నెలకు రూ.50వేలు భరణంగా చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద రూ.1,000 ఇవ్వాలని తీర్పు చెప్పింది. పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మి ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. తీర్పు ఉత్తర్వులు విడుదలైన 3 నెలల్లోపు ఇవన్నీ అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. లేదంటేఈ మొత్తానికి 12శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు.