రాష్ట్ర వ్యాప్తంగా ఛలో కలెక్టరేట్ పేరుతో నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. నోటిఫికేషన్లు ఎక్కడని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మొన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కారును తూట్లు పొడిచారు. పీఆర్సీపై కదం తొక్కారు. ఛలో విజయవాడతో జగనన్నకు ముచ్చెమటలు పట్టించారు. సమ్మె సైరన్తో నిద్రలేకుండా చేశారు. చివరాఖరికి ఎలాగోలా పీఆర్సీ సెగపై నీళ్లు చల్లారు. అటు ఆ మంట అలా చల్లారిందో లేదో.. ఇటు నిరుద్యోగుల ఆగ్రహ జ్వాల ఎగిసిపడింది.
ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ‘చలో కలెక్టరేట్’ పేరుతో జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, ఏలూరు, కాకినాడ, ఒంగోలు, కడపలో నిరసనలు చేపట్టారు. అనంతపురం, విజయనగరం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడం.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కడపలో నిరుద్యోగులను అడ్డుకునేందుకు పోలీసులు ముళ్లకంచెలు అడ్డుగా వేశారు. ఆందోళనలకు దిగిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు ప్రవర్తించిన తీరుపట్ల కొందరు విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్నామని తెలిపారు. ప్రభుత్వం మూడేళ్లు గడిచినా.. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. దీని వల్ల అటు ఇన్స్టిట్యూట్ ఫీజులు వేలకువేలు చెల్లించలేక.. ఇటు హాస్టళ్లకు నెల నెల డబ్బులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బంది పడటమే కాక.. నోటిఫికేషకన్ కోసం ఎదురు చూసి చూసి మానసికంగా కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.