స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న గొడవలు చూడలేకపోయాడు ఓ వ్యక్తి. ఎలాగైనా తన స్నేహితుడి సమస్యలను పరిష్కరించి సంతోషంగా ఉండేలా చేయాలని భావించాడు. అయితే ఈ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం అనేది సర్వసాధారణం. మన పెద్దల కాలం నుంచి కూడా దంపతుల మధ్య భయంకరమైన గొడవలు జరిగేవి.. అయినా సర్ధుకుపోతు జీవిస్తుంటారు. కానీ నేటికాలంలో భార్యాభర్తల ఆలోచనశైలి మారింది. చిన్నపాటి గొడవకి కూడా పంతాలకు పోయి.. పెద్దదిగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకునేందుకు, హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అప్పుడప్పుడు ఆత్మహత్యకు యత్నించిన సమయంలో ఇరుగుపొరుగు వారు చూసి కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని కాపాడబోయిన వారు మృత్యువాత పడుతుంటారు. తాజాగా అలాంటి ఘోరమే ఒకటి జరిగింది. ఆత్మహత్యకు యత్నించిన స్నేహితుడి భార్యను రక్షించబోయి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లలోకి వెళ్తే..
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటకు చెందిన కాపకాయల నరేంద్రకుమార్(31) కుటుంబతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ కుటుంబానికి ఆర్ధికగా చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతడికి కొవ్వూరులో జావిద్ పాషా అనే స్నేహితుడు ఉన్నాడు. జావిద్ కు దేవీ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. ఇటీవల కొంతకాలం నుంచి ఆ దంపతులక మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఈక్రమంలో ఇటీవల కూడా మరోసారి జావిద్ దంపతుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగినట్లు సమాచారం.
స్నేహితుడి దంపతులకి మనస్పర్థలు వచ్చాయని తెలిసిన నరేంద్రకుమార్.. వారికి సర్థి చెప్పేందుకు ఫిబ్రవరి 14 వారిద్దరినీ తన ఇంటికి తీసుకు వచ్చారు. ఈ క్రమంలో జావిద్ పాషా అతని భార్య 15వ తేదీ తెల్లవారు జామున మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన దేవీ తాను చనిపోతానంటూ బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే దేవీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన నరేంద్ర కుమార్.. కాలువలో దూకబోయిన దేవిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆమెను రక్షించే ప్రయత్నంలో నరేంద్ర కుమార్ అదుపు తప్పి కాలువలో జారి గల్లంతయ్యారు.
గురువారం నరేంద్ర మృతదేహం లభ్యమైంది. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు ఎవరినో కాపాడబోయి.. తాను ప్రాణాలు కోల్పోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతుడి తల్లి తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. స్నేహితుడి భార్యను రక్షించబోయిన తాను ప్రాణాలు కోల్పోయిన నరేంద్ర కుమార్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.