ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన 14 మంది బంధువులు తిరుమల శ్రీవారి దర్శనానికి తుఫాన్ వాహనంలో బయలు దేరారు. తిరుమల చేరుకుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి వారి స్వగ్రామాలకు అదే వాహనంలో బయలు దేరారు. మార్గం మధ్యలో వైఎస్సార్ కడప జిల్లా కొండాపూర్ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో కడప- తాడిపత్రి జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ ప్రమాదానికి గురైంది. శ్రీవారి భక్తులు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారందరు తాడిపత్రికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అలానే ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.